BS-VII Emission Standards by 2030: దేశంలో వాహనాల కాలుష్య నియంత్రణ నిబంధనలు మరింత కఠినంగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న బీఎస్-VI ఉద్గార ప్రమాణాలు ఉండగా, ప్రభుత్వం బీఎస్-VII నిబంధనలను తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త నిబంధనలు 2030 నాటికి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ అంశంపై చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వాహన తయారీ సంస్థలు, ఇంధన కంపెనీలు, పరీక్షా సంస్థలు, ఇతర సంబంధిత వర్గాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. కొత్త ప్రమాణాలను అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక మార్పులు, పరిశ్రమకు ఇవ్వాల్సిన సమయం లాంటి అంశాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది.
2020లో భారత్ బీఎస్-IV నుంచి నేరుగా బీఎస్-VI ప్రమాణాలకు మారింది. ఆ మార్పు వల్ల వాహనాల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు గణనీయంగా తగ్గాయి. ఇప్పుడు బీఎస్-VII ద్వారా మరింత కఠినమైన ఉద్గార నియంత్రణ లక్ష్యాలను ప్రభుత్వం సాధించాలని భావిస్తోంది. కొత్త నిబంధనల్లో కేవలం ఉద్గార పరిమితులను మాత్రమే కాకుండా, వాస్తవ ప్రపంచంలో వాహనాల పనితీరును కూడా పర్యవేక్షించే విధానాలను చేర్చే అవకాశం ఉంది. అలాగే ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్, వాహనాల మన్నిక, దీర్ఘకాలిక కాలుష్య నియంత్రణ పనితీరు లాంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
బీఎస్-VII ప్రమాణాలు యూరప్లో అమలు కానున్న యూరో-7 నిబంధనలను ఆధారంగా చేసుకుని రూపొందించబడతాయి. అయితే, దేశంలోని రహదారి పరిస్థితులు, వాతావరణం, ఇంధన నాణ్యతకు అనుగుణంగా కొన్ని మార్పులు టాయి. ఈ మార్పు ఆటోమొబైల్ కంపెనీలకు కొత్త సవాళ్లను తీసుకురానుంది. వాహన తయారీదారులు ఇంజిన్ టెక్నాలజీలను అప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొత్త ఉద్గార నియంత్రణ పరికరాలు, సాఫ్ట్ వేర్ వ్యవస్థలు, పరీక్షా సదుపాయాలపై కూడా భారీగా పెట్టుబడులు పెట్టాల్సి రావచ్చు.
కొత్త నిర్ణయంతో వాహనాల ధరలపై భారీగా భారం పడే అవకాశం ఉంది. ఇండస్ట్రీ అంచనాల ప్రకారం, బీఎస్-VII నిబంధనలకు అనుగుణంగా వాహనాలను తయారు చేయడానికి ఒక్కో వాహనంపై అదనంగా రూ.30 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఖర్చు పెరిగే అవకాశం టుంది. ఈ అదనపు వ్యయం వినియోగదారులపై ధరల రూపంలో పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని చిన్న మోడళ్లను, తక్కువ అమ్మకాలు ఉన్న వాహనాలను కంపెనీలు నిలిపివేసే అవకాశమూ ఉంది. ఎందుకంటే వాటిని కొత్త ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం ఆర్థికంగా లాభదాయకం కాకపోవచ్చు.
మరోవైపు, వినియోగదారులు స్ట్రాంగ్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మరింతగా మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే బీఎస్-IV నుంచి బీఎస్-VIకి మారినప్పుడు జరిగినట్లుగా ఈసారి ఇంధన శుద్ధి కర్మాగారాల్లో పెద్ద ఎత్తున మార్పులు అవసరం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీఎస్-VII నిబంధనలు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడినా, వాహనాల ధరలు పెరగడం, తయారీదారులపై అదనపు భారం పడటం లాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
Read Also: ఫాస్ట్ ఛార్జింగ్ vs స్లో ఛార్జింగ్.. EV బ్యాటరీకి ఏది బెస్ట్?