Chamala On TDP MP: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై లోక్సభలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ వేదికగా జరిగిన ఈ వాగ్వాదం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
లోక్సభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదించిన విధానాన్ని తప్పుపట్టారు. ‘అప్పట్లో లోక్సభ తలుపులు మూసి, చీకటిగా బిల్లును పాస్ చేశారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన ఫిబ్రవరి 14, 2014ను ఒక ‘బ్లాక్ డే’ గా ఆయన అభివర్ణించారు. ఈ విభజన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరగలేదని ఆయన అర్థం వచ్చేలా మాట్లాడటం కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం తెప్పించింది.
టీడీపీ ఎంపీ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆయన తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ప్రధాన అంశాలను లేవనెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో కేంద్రానికి లేఖ ఇచ్చిన విషయం కృష్ణదేవరాయలకు తెలియదా అని ప్రశ్నించారు. సొంత పార్టీ అధినేతే మద్దతు పలికినప్పుడు, ఇప్పుడు ప్రక్రియను తప్పు పట్టడం ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా, ఇంకా పాత విషయాలను తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు. రెండు రాష్ట్రాలు ప్రస్తుతం సత్సంబంధాలతో ముందుకు సాగుతున్న తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు ప్రాంతీయ విద్వేషాలను ప్రేరేపించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై గానీ, ఆ రాష్ట్ర అస్తిత్వంపై గానీ మరోసారి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని చామల స్పష్టం చేశారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఇంకా కొన్ని కొలిక్కి రావలసి ఉంది. ఇటువంటి సమయంలో పార్లమెంట్ సాక్షిగా జరిగిన ఈ మాటల యుద్ధం, రాజకీయంగా తెలుగుదేశం , కాంగ్రెస్ మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టింది.
Also Read: అమెరికా ఆధిపత్యానికి ఎండ్ కార్డ్? చైనా కొత్త యుద్ధ తంత్రం ఇదే!