PDS Sanna Biyyam Scheme Anniversary: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, తెలంగాణ అసెంబ్లీ డైనింగ్ హాలులో ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేకంగా ‘సన్నబియ్యం విందు’ ఏర్పాటు చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ విందులో పాలక, ప్రతిపక్షాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సాధారణంగా రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు అందుతున్న అదే నాణ్యమైన సన్నబియ్యంతో ఈ వంటకాలను సిద్ధం చేశారు. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఆహారం ఏ స్థాయిలో ఉందో స్వయంగా రుచి చూడాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విందులో పాల్గొని, అందరితో కలిసి భోజనం చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ప్రభుత్వ సంకల్పం ఈ ఏడాది కాలంలో ఎంతటి విజయాన్ని సాధించిందో ఈ కార్యక్రమం చాటిచెప్పింది.
భోజనం అనంతరం ముఖ్యమంత్రి, ఇతర సభ్యులు సన్నబియ్యం నాణ్యత పట్ల హర్షం వ్యక్తం చేశారు. సన్నబియ్యం విందు బాగుందంటూ సభ్యులందరూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కితాబిచ్చారు. పేదలకు అందుతున్న బియ్యం నాణ్యతను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించి, సభ్యులకు వడ్డనలో స్వయంగా పాలుపంచుకోవడం విశేషం.
గతంలో రేషన్ షాపుల ద్వారా కేవలం దొడ్డు బియ్యం మాత్రమే పంపిణీ చేసేవారు. చాలా మంది ఆ బియ్యాన్ని తినలేక బయట అమ్ముకోవడం లేదా పక్కన పడేయడం జరిగేది. దీనిని గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సామాన్యుడికి కూడా సన్నబియ్యం భోజనం అందాలనే ఉద్దేశంతో ఈ వినూత్న మార్పును తీసుకువచ్చింది. రాష్ట్రంలోని సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డు (Food Security Cards) కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రభుత్వం సేకరించిన మేలైన రకం వడ్ల నుండి తీసిన సన్నబియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఇది చూడటానికి తెల్లగా, వండినప్పుడు పొడిపొడిగా రుచికరంగా ఉంటుంది.
Read Also: బలమైన ఆహారమే.. కానీ మీ కిడ్నీలకు శాపంగా మారే అవకాశం! మినప్పప్పు వెనక ఉన్న చేదు నిజం