Telangana Assembly Winter sessions: తెలంగాణలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు హాట్ హాట్గా జరగనున్నాయా? కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై కౌంటర్ ఇచ్చేందుకు పాలకపక్షం సిద్ధమైందా? అధికార-విపక్షాలు తమతమ అస్త్రాలను రెడీ చేశాయా? కానీ, కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి పరిమితం కానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఇప్పటికే మీడియా ముందు పలు అంశాలపై పాలక పక్షాన్ని ప్రశ్నించారు మాజీ సీఎం కేసీఆర్. విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు లేవనెత్తే అంశాలను తిప్పికొట్టేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు కేసీఆర్, ఒక్కరోజు మాత్రమే సభకు వస్తున్నట్లు తెలుస్తోంది.
2023 నుంచి ఇప్పటివరకు కేసీఆర్ రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. అంటే ఏడాదికి ఒక్కసారి చొప్పున మాత్రమే. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒకసారి, రెండోసారి బడ్జెట్ సెషన్కి మాత్రమే పాల్గొన్నారు. శీతాకాల సమావేశాల్లో కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే హాజరవుతారని, చర్చలకు దూరంగా ఉంటారని పార్టీ నేతల మాట. అందుకు కారణాలు లేకపోలేదు.
ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ హాజరు?
ఆరునెలలోపు సమావేశాలకు హాజరుకాకుండా సభ్యత్వం రద్దు అవుతుందని, అందుకే ఈసారి సమావేశాలకు హాజరవుతున్నారని ఆ పార్టీ నేతల మాట. పాలక పక్షాన్ని పోయినవారం మీడియా ముందు ప్రశ్నించారని, ఇప్పుడు ప్రశ్నించడానికి ఏమీ ఉండదని అంటున్నారు. వాటిపై పాలకపక్షం రిప్లై మాత్రమే ఇస్తుందని, అందుకు మిగతా నేతలు ధీటుగా సమాధానం చెబుతున్నారని అంటున్నారు.
గత మీడియా సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి పేరు ఎత్తకుండా కేసీఆర్ మాట్లాడారని అంటున్నారు. ముఖ్యమంత్రి పేరు తలచడానికి కేసీఆర్ ఇష్టపడడంలేదని కొందరు నేతలు ‘ఆఫ్ ద రికార్డు’లో చెబుతున్నారు. అలాంటప్పుడు ఆయన సభా సమావేశాలకు ఎలా వస్తారని అంటున్నారు.
ALSO READ: ఈ ఏడాదిలో రూ. 239 కోట్ల ట్రాఫిక్ చలాన్లు.. హైదరాబాద్ పబ్లిక్ మారతారా?
తొలిరోజు సమావేశాల్లో ఎలాంటి చర్చ ఉండదని, ప్రారంభమైన కొద్దిసేపటికి వాయిదా పడుతుందని అంటున్నారు నేతలు. ఆ తర్వాత బీఏసీలో సమావేశాలు ఎన్నిరోజులు? ఏయే అంశాలు ప్రశ్నించాలనే దానిపై చర్చిస్తారని అంటున్నారు. బీఏసీ సమావేశాలకు హరీష్రావు మాత్రమే హాజరవుతారని అంటున్నారు. మొత్తానికి ఎటుచూసినా జగన్ దారిలో కేసీఆర్ వెళ్తున్నట్లు నేతలు ముచ్చటించుకుంటున్నారు.
సోమవారం శాసనసభ సమావేశాలు మొదలుకాగానే తొలుత డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత పలు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్లకు సంబంధించిన బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, తెలంగాణ మునిసిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చట్ట సవరణకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెడతారు సీఎం రేవంత్రెడ్డి. బిల్లులు ప్రవేశ పెట్టిన సభను జనవరి రెండుకు వాయిదా పడనుంది.