Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయా? తెలంగాణ బీజేపీ-జనసేన మధ్య కోల్డ్వార్ మొదలైందా? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు ఇరు పార్టీలు సిద్ధమయ్యిందా? తెలంగాణ బీజేపీ ఈ స్టాండ్ తీసుకోవడం వెనుక అసలు ఏం జరిగింది? జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితమే అందుకు కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఊహించని విధంగా రికార్డు స్థాయిలో మెజార్టీ సీట్లను కూటమి గెలుచుకుంది. తెలంగాణలో కూడా కూటమిగా ఏర్పడే అవకాశముందని రాజకీయ పార్టీలు భావించాయి. ఇరుపార్టీల మధ్య ఏం జరిగిందో తెలీదు. తెలంగాణ బీజేపీ-జనసేన మధ్యకోల్డ్వార్ తారాస్థాయికి చేరినట్టు వార్తలు వస్తున్నాయి.
దీంతో ఇరు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో తెలంగాణ జనసేన నేతలకు హైకమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో నేతలు భేటీ కావడం జరిగింది. అదే సమయంలో తెలంగాణ బీజేపీ తనవైపు క్లారిటీ ఇచ్చింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అవసరం లేదని, ఒంటరిగా పోటీ చేస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ తేల్చి చెప్పారు.
జనసేనతో తెలంగాణ బీజేపీ కటీఫ్.. ఒంటరిగా బరిలోకి
మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనుంది బీజేపీ. పొత్తులు ఏ మాత్రం అవసరం లేదని వక్కానించారు తెలంగాణ బీజేపీ చీఫ్. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, ఒకవేళ పొత్తులుంటే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు రాంచందర్ రావు.
తెలంగాణలో తాము బలంగా ఉన్నామని, అధిష్టానికి అదే చెప్పామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఇలాంటి సమయంలో ఒంటరిగా వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని మనసులోని ఆలోచనను బయటపెట్టారు. ఏపీ-తెలంగాణల్లో వేర్వేరు రాజకీయ పరిణామాలు ఉన్నాయని వెల్లడించారు.
ALSO READ: శబరిమలలో సీఎం రేవంత్ ఫ్లెక్సీ.. పదేళ్లు సీఎంగా ఆయన ఉండాలని ఆకాంక్ష
తెలంగాణ జనసేన ఏమంటోంది? మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు ఉన్నా లేకున్నా పోటీ చేస్తామని తెగేసి చెప్పేసింది. 2028 అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని చెబుతున్నారు ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి వెళ్లాయి.
జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చింది. అయితే జనసేన ఎలాంటి ప్రభావితం చూపలేదని కమలనాధుల అంచనా. మున్సిపల్ ఎన్నికల్లో బలాలను చూసి దాని ప్రకారం 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండవచ్చని అంటున్నారు. మొత్తానికి సొంతంగా ఎదిగేందుకు ఇరు పార్టీలు సిద్ధమైనట్టు కనిపిస్తోంది.