Telangana Budget Session: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. బడ్జెట్ రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమైంది. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తుంది. ఇప్పటికే శాఖల వారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షలు నిర్వహించారు. ఆయా శాఖల నుంచి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన వివరాలను స్వీకరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతుంది. బడ్జెట్ పై చర్చ, ఆమోదం కోసం ఈ దప సమావేశాలను ప్రభుత్వం 10 నుంచి 15 రోజులపాటు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. శాఖలకు కేటాయించిన అంశాలను సైతం విస్తృతంగా అసెంబ్లీలో చర్చించాలని భావిస్తుంది. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇచ్చేందుకు, కీలక బిల్లులపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదించేలా సమావేశాలను నిర్వహించాలని భావిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షలు కంప్లీట్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను ఈనెల చివరి వారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికలు ముగిసిన తర్వాత క్యాబినెట్ సమావేశం నిర్వహించి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్లో ఎన్నికల హామీలు, మున్సిపల్, గ్రామాల అభివృద్ధికి నిధుల కేటాయింపు లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు నిర్వహణపైనే సీఎం రేవంత్ రెడ్డి తో శుక్రవారం డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క భేటీ అయినట్లు సమాచారం. బడ్జెట్ కేటాయింపులు, ఏ ఏ రంగాలకు ప్రాధాన్యత, తదితర అంశాలను చర్చించినట్లు సమాచారం. త్వరలోనే అన్ని శాఖ ల ఉన్నత అధికారులతో సీఎం, డిప్యూటీ సీఎం బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఆ సమావేశం లో బడ్జెట్కు తుది మెరుగులు దిద్దబోతున్నట్లు తెలిసింది.
Also Read: Telangana Municipal Elections: పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు.. తెర వెనుక ఏం జరిగింది?
బడ్జెట్ కేటాయింపుల్లో ప్రధాన రంగాలకు అధిక నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. హామీలు గ్యారెంటీ ల పైన ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు తావు లేకుండా కేటాయింపులు చేసి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వివరించబోతుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో గత బి ఆర్ ఎస్ ఏఏ రంగాలను విస్మరించింది అనే అంశాలను సైతం ఎండగట్టేందుకు సిద్ధమవుతుంది. ఇరిగేషన్ రంగానికి కేటాయించిన నిధులను ఎలా దుర్వినియోగం చేశారనేది కూడా మరో మారు అసెంబ్లీ వేదికగా వివరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధాన ప్రతిపక్షమైన టిఆర్ఎస్ అయితే హామీలు గ్యారంటీలో బడ్జెట్ కేటాయింపులపైనే ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తుంది. ఇప్పటికే వాటిపై నిలదీస్తామని పలు సమావేశాల్లో గులాబీ నేతలు ప్రకటించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో హాట్ హాట్ గా చర్చ జరగనుంది.
గత ఏడాది (2025-26)తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పద్దును ప్రవేశపెట్టారు. రూ.3,04,965 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ఉంది. రాష్ట్రం అప్పులు రూ.5,04,814 కోట్లుగా ఉంది. అయితే ఈ సంవత్సరం(2026-27) బడ్జెట్ ఎంత పెంచుతారు.. ఏ ఏ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.. 6 గ్యారంటీలకు గత బడ్జెట్లో 56084 కోట్లు కేటాయించింది. ఇప్పుడు ఆ బడ్జెట్ ని ఎంత పెంచుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Revanth Reddy: కానిస్టేబుళ్ల కుటుంబాలకు రూ. కోటి సాయం.. ముఖ్యమంత్రి రేవంత్ చేతులమీదుగా..