TG20 League: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్వహించ తలపెట్టిన టీజీ20 లీగ్ టోర్నమెంట్ పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో శుక్రవారం హెచ్సీఏకు అధికారికంగా లీగల్ నోటీస్ పంపించింది. ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి కూడా వినతిపత్రం పంపించింది. త్వరలోనే టీజీ20 టోర్నీని ప్రారంభించనున్నట్టు ఇటీవల హెచ్సీఏ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కోసం గవర్నింగ్ కౌన్సిల్ ను కూడా ఏర్పాటు చేసింది. అయితే, టీజీ 20 లీగ్ నిర్వహణకు హెచ్సీఏ బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి తెలిపారు. అయినా, అనుమతులు తీసుకున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అనుమతులు ఉన్నట్టయితే వాటిని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
అసలు టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ కు హెచ్సీఏ జనరల్ బాడీ ఆమోదం ఉందా? లేదా? అన్న విషయాన్ని వెల్లడించాలన్నారు. హెచ్సీఏ అక్రమంగా తెలంగాణ క్రికెట్ వ్యవస్థను హస్తగతం చేసుకోవటానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అధికారిక ఈ మెయిళ్లకు సరైన సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుంటోందన్నారు. అదే సమయంలో అనుమతులు ఉన్నాయంటూ కార్పోరేట్ సంస్థలు, ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు, క్రికెట్ వర్గాలను తప్పుదోవ పట్టిస్తోందని చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్ వెలుపల జిల్లాల్లో గత పన్నెండేళ్లుగా టీసీఏ ఆధ్వర్యంలో క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా కొనసాగుతున్నట్టు తెలిపారు. 2021, జూలై 11న బీసీసీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం టీసీఏతో సంప్రదింపులు జరిపి హెచ్సీఏ పని చేయాల్సి ఉందన్నారు.
Also Read: రవాణా శాఖలో కొత్త శకం.. కొత్తగా లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి సూపర్ చాన్స్..?
ప్రతిభావంతులైన క్రికెటర్లకు అవకాశాలు కల్పించేందుకు టీసీఏ జూన్ లో తెలంగాణ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను పారదర్శకంగా ప్రారంభించనున్నట్టు ధరం గురువారెడ్డి చెప్పారు. హెచ్సీఏ చేస్తున్న అవాస్తవ ప్రకటనలను నమ్మి కార్పోరేట్ సంస్థలు, స్పాన్సర్లు, బ్రాడ్ కాస్టర్లు, వెండర్లు డబ్బులు ఖర్చు చేస్తే ఖచ్చితంగా ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఇప్పటికే ఈ అంశంపే బాంబే హైకోర్టులో విచారణ నడుస్తోందని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో హెచ్సీఏ ఏకపక్షంగా లీగ్ ను ప్రకటించటం న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నమే అని పేర్కొన్నారు. 48గంటల్లో బీసీసీఐ దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also read: మిషన్ తెలంగాణకు షా స్కెచ్.. బీఆర్ఎస్ నేతలే వారి టార్గెట్.. హైదరాబాద్లో తిష్ట వేయనున్న బెంగాల్ టీమ్!