భారత దేశంలోనే తెలంగాణ పోలీస్ విభాగం అత్యుత్తమ సేవలందిస్తూ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) జితేందర్ (శివధర్ రెడ్డి) పేర్కొన్నారు. రాజేంద్రనగర్లోని రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి (RBVRR) తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ డీఎస్పీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రధానంగా సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ పోలీస్ అనుసరిస్తున్న వ్యూహాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు.
గత మూడు దశాబ్దాలుగా పోలీస్ వ్యవస్థలో వచ్చిన మార్పులను డీజీపీ ఈ సందర్భంగా వివరించారు. 1990వ దశకంలో పోలీసులను కేవలం ఒక ‘ఫోర్స్’ (బలగం)గా చూసేవారని.. కానీ నేడు అది పోలీస్ సర్వీస్ గా రూపాంతరం చెందిందని చెప్పారు. అధికారులు కేవలం శాంతిభద్రతలను కాపాడటమే కాకుండా, ప్రజల సమస్యలను పరిష్కరించే సేవకులుగా మారిన విధానాన్ని ట్రైనీ ఆఫీసర్లకు వివరించారు. వృత్తిలో ఎల్లప్పుడూ సమగ్రత, మానవీయ విలువలను కాపాడాలని ఆయన ఉద్బోధించారు.
టెక్నాలజీయే ఫోర్స్ మల్టీప్లయర్..
మారుతున్న నేరాల ధోరణికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ముందంజలో ఉందని డీజీపీ తెలిపారు. టెక్నాలజీని ఒక ‘ఫోర్స్ మల్టీప్లయర్’గా అభివర్ణిస్తూ.. డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. దేశంలో కొత్తగా వచ్చిన చట్టాలను (BNS, BNSS, BSA) ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ చట్టాలతో అనుసంధానించి సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. CCTNS, ICJS వ్యవస్థల ద్వారా పోలీస్, కోర్టులు, జైళ్ల విభాగాల మధ్య సమన్వయం పెరిగిందని వివరించారు.
సైబర్, నార్కోటిక్ బ్యూరోల ప్రాధాన్యత..
సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతిష్టాత్మకంగా స్థాపించిన ‘సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ మరియు డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ‘నార్కోటిక్ బ్యూరో’ల పనితీరును ఆయన అభినందించారు. ఆర్థిక నేరాలను అరికట్టడానికి సైబర్ బీట్ పోలీసింగ్ అవసరమని, డిజిటల్ ఫుట్ప్రింట్స్, సైబర్ ఫోరెన్సిక్స్ నేడు దర్యాప్తులో కీలకంగా మారాయని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువైనప్పుడే అసలైన గుర్తింపు లభిస్తుందని డీఎస్పీలకు సూచించారు.
చివరగా.. అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న అధికారులు ‘స్మార్ట్’ (SMART) పోలీసింగ్ నేర్చుకుని.. సమాజానికి మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ఉన్నతాధికారులు మధుకర్ స్వామి, కవిత, నరహరి తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: Telangana: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు.. ఫ్యూచర్ సిటీకి కొత్త బాధ్యతలు