Ponnam Prabhakar: తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా సిద్దిపేట కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రగతిని, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్వేయంగా అడుగులు వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలు.. ఇందిరమ్మ ఇళ్లు
రాష్ట్రంలోని ప్రతి పౌరునికి అండగా నిలిచేలా.. ‘ ఇందిరమ్మ జీవిత భీమా పథకం’ తీసుకొచ్చామని, అలాగే రూ. 2 లక్షల పెన్షన్ల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించామని మంత్రి తెలిపారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు మెుదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని, తాజాగా రెండో దశను సీఎం రేవంత్ ఆసిఫాబాద్లో ప్రారంభించారని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సత్ఫలితాలనిస్తున్నాయన్నారు.
వ్యవసాయం.. పర్యావరణం
జిల్లాలో సన్న బియ్యం కొరతను అధిగమించేందుకు రైతుల సన్న రకాలు పండించేలా విత్తనాల స్థాయి నుంచే అవగాహన కల్పిస్తామన్నారు. నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభమైందని, రైతులు దీని వైపు మెుగ్గు చూపేలా ప్రణాళికలు ఉన్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామగ్రామాన మెుక్కలు నాటేలా ప్రత్యేక కమిటీలు వేస్తున్నామని, కాలువలు గట్లపై నాటడానికి 3 లక్షల ఈత చెట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
విద్య, ఉపాధి, రోడ్డు భద్రత
జూన్ 12న పాఠశాలలు ప్రారంభమయ్యే రోజే విద్యార్థులకు కిట్లు అందిస్తామని, బడి బాటలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. నిరుద్యోగుల కోసం ఇప్పటికే ఉద్యోగాల భర్తీ చేపట్టామని, త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయని భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ‘ అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లలో పాడైపోయిన వాహనాలను ఉంచి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.
Also Read: పవన్ సంచలన ప్రకటన.. తెలంగాణలో జనసేన పోటీ.. తేల్చుకుందామని సవాల్!