Virender Sehwag On Ganguly: టీమిండియా ఒకప్పటి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ( Ganguly) కారణంగా తాను ఓపెనర్ గా ఎదిగినట్లు గుర్తు చేశారు. మిడిల్ ఆర్డర్ లో ఉన్న తనను దాదానే… ఓపెనర్ గా దించి ప్రయోగం చేసిన విషయాన్ని వివరించారు వీరేంద్ర సెహ్వాగ్. దాని ఫలితంగా తన కెరీర్ పూర్తిగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఓపెనర్ గా మార్చి తన కెరీర్ ను ఓ రేంజ్ కు తీసుకువచ్చిన దాదాకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు వీరేంద్ర సెహ్వాగ్. దీంతో దాదాపై వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
1990 లో టీమిండియాలో వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ లాంటి ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు ఉండేవారు. అయితే ఆ సమయంలో కూడా టెస్టులను టి20లాగా ఇరగదీసే వాడు వీరేంద్ర సెహ్వాగ్. అలాంటి వీరేంద్ర సెహ్వాగ్ ను ఓపెనర్ గా తీర్చిదిద్ది.. అతడి కెరీర్ ను మలిచాడు దాదా. ఈ విషయాన్ని తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ఒ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దాదా కెప్టెన్ గా ఉన్న సమయంలో తాను మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే వాడినని గుర్తు చేశారు. అయితే జట్టు అవసరాల రీత్యా సచిన్ టెండూల్కర్ తో ఓపెనర్ గా బరిలోకి దిగాలని తనకు దాదా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు వీరేంద్ర సెహ్వాగ్. కానీ ఓపెనర్ గా దిగాలంటే తనకు ధైర్యం చాలు లేదన్నారు. ధైర్యం చేసి ఓపెనర్ గా దిగినా, విఫలమయ్యే ప్రమాదం ఉందని భయపడినట్లు చెప్పుకొచ్చారు.
ఓపెనర్ గా విఫలమైతే తనను టీమిండియా నుంచి పర్మినెంట్ గా తొలగించే ఛాన్స్ కూడా ఉన్నట్లు తాను ఊహించుకున్నానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో బాండ్ పేపర్ లాగా.. ఒక వైట్ పేపర్ పైన తన బెర్త్ పైన భరోసా ఇవ్వాలని దాదాను డిమాండ్ చేసినట్లు చెప్పుకొచ్చారు వీరేంద్ర సెహ్వాగ్. సచిన్ టెండూల్కర్ తో ఓపెనింగ్ చేస్తాను.. కానీ తాను విఫలమైతే మళ్లీ మిడిల్ ఆర్డర్ లోనే కొనసాగించేలా తనకు హామీ ఇవ్వాలని… తెల్ల కాగితంపై రాసి ఇవ్వాలని మొండి పట్టు పట్టానని వెల్లడించారు. ఆ భరోసా సౌరవ్ గంగూలీ ( Ganguly) నుంచి వచ్చిన తర్వాత తాను ఓపెనర్ గా బరిలోకి దిగినట్లు గుర్తు చేశారు. అయితే ఓపెన్ గా దిగిన తాను అద్భుతంగా రాణించి… ముందుకు సాగినట్లు తెలిపారు.