Ramzan 2026: రాబోయే రంజాన్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. షాపులు, ఎస్టాబ్లిష్మెంట్లకు ప్రత్యేక మినహాయింపులు ప్రకటించింది. ఫిబ్రవరి 19 నుండి మార్చి 20 వరకు ఈ మినహాయింపులు అమల్లో ఉండనున్నాయి. దీని ప్రకారం ఆయా రోజుల్లో తెల్లవారుజామున 5 గంటల వరకు షాపులు తెరిచి ఉంచుకోవచ్చు. రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని లేబర్ కమిషనర్ దాన కిషోర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
రంజాన్ వేళ పనిగంటలను పొడిగించిన నేపథ్యంలో ఉద్యోగులు, కార్మికులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరికొన్ని నిబంధనలు జారీ చేసింది. అదనపు పని చేసిన ఉద్యోగులకు డబుల్ వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. సెలవు రోజుల్లో పని చేస్తే ప్రత్యామ్నాయ సెలవు తప్పనిసరి అని పేర్కొంది. ఏ రోజు అయినా పని సమయం 13 గంటలు మించకూడదని షరతు విధించింది. అదే సమయంలో మహిళా ఉద్యోగులకు అదనపు పని నుంచి మినహాయింపు ఇచ్చింది. రాత్రి 8:30 తర్వాత మహిళా ఉద్యోగులను పనిచేయించరాదని ఆదేశించింది.
దుకాణాల సమయాన్ని పొడిగించిన నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో రంజాన్ శోభ సంతరించుకోనుంది. పాతబస్తి, చార్మినార్, లాడ్ బజార్ వంటి ముస్లిం పాపులారిటీ అధికంగా ఉండే ఏరియాల్లో తెల్లవారుజాము వరకూ షాపులు తెరుచుకోనున్నాయి. దీని ద్వారా పసందైన వంటకాలు అటు ముస్లింలతో పాటు నగరవాసులకు సైతం అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా హలీమ్, బిర్యానీ, ఇరానీ చాయ్ వంటివి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫుడ్ లవర్స్ కు లభించనున్నాయి.
Also Read: Rahul Gandhi: చైనా రోబోలు పట్టుకొచ్చి.. మనవని చెప్తారా? కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ
రాబోయే రంజాన్ పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ శాఖ కూడా మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఉర్దూ స్కూళ్లతో పాటు పాటు డైట్ (DIET) కళాశాలలకు ప్రత్యేక పని వేళలను కల్పించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకూ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో మిస్ అయిన సిలబస్ ను కవర్ చేసేందుకు మార్చి 20 నుంచి అదనపు తరగతులు ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.