Telangana govt: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా? బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్లాలా? అనేదానిపై తర్జనభర్జన పడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల నిర్వహణకు కొంత సమయం కావాలని భావించి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తుందా? స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లడమే ఉత్తమమా? అనేదానిపై మల్లగుల్లాలు పడుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్లో అందుబాటులో వున్న మంత్రులతో సీఎం రేవంత్రెడ్డి చర్చించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగి ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలు పాల్గొన్నారు.
బీసీల రిజర్వేషన్ల విషయంలో కేంద్రం మరింత డిలే చేస్తే ఇబ్బంది అవుతుందని మంత్రులు సీఎం దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని పలువురు మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది మంత్రులు ఇదే అభిప్రాయపడ్డారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. చివరకు ఫైనల్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి వదిలేశారట.
ఈ ప్రక్రియపై వచ్చేవారం స్పష్టత రావచ్చని అంటున్నారు. బుధ లేదా గురువారాల్లో మరోసారి మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశముందని అంటున్నారు. అప్పుడు ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నాయి. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేలా వెంటనే జీవో ఇచ్చేదిశగా కసరత్తు మొదలైనట్టు సమాచారం.
ALSO READ: హైదరాబాద్ లో రెండు స్కైవాక్ లు ఆ ప్రాంత ప్రజల కష్టాలు తీరినట్టే
చట్టప్రకారం రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన తర్వాత వెళ్తే బాగుంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్లు 90 రోజుల్లోగా ఆమోదించాలనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఉంటే ఎలా ఉంటుందని అన్నదానిపై మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారట సీఎం.
సుప్రీంకోర్టు నిర్ణయం ఎప్పుడు చెబుతుందో తెలీదని, డిలే అయితే బాగుండదని అన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు ప్రకారం ఈ నెలాఖరులో ఎన్నికలకు వెళ్లడం మంచిదని మంత్రులు అన్నట్లు సమాచారం. ఈనెల చివరినాటికి నోటిఫికేషన్ రాని పక్షంలో మరింత గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరే అవకాశముందని పార్టీ వర్గాల మాట.
సెప్టెంబరు నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల బిల్లుని గవర్నర్కు పంపినా ఇంకా ఆమోదం పొందలేదు. దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. బిల్లుల ఆమోదంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఓ జీఓ జారీ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు అవకాశాలను పరిశీలించినట్లు తెలుస్తోంది.
న్యాయపరంగా చిక్కులు ఎదురైతే పార్టీపరంగా బీసీలకు 42 శాత టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనే కోణంలో చర్చించారట. వచ్చేవారంలో నోటిఫికేషన్ వస్తుందా లేదా? అనేదానిపై నాలుగైదు రోజుల్లో క్లారిటీ రానుంది. అటు తెలంగాణ ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే సిబ్బందిని రెడీ చేసింది. ప్రభుత్వం నుంచి నిర్ణయం రాగానే నోటిఫికేషన్ ఇవ్వాలన్నది ఈసీ ఆలోచన.