Crop Procurement: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రైతుల ప్రయోజనాల దృష్ట్యా మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటి కొనుగోళ్లపై కేంద్రం నుంచి ఆశించిన స్పందన రాకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ పంటలను కొనుగోలు చేయనుంది. దీనికి ముఖ్యమంత్రి ఆమోద ముద్ర లభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి భారీ స్థాయిలో పంట కొనుగోళ్లు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
యాసంగి 2025-26 సీజన్లో రాష్ట్రంలో మొక్కజొన్న సాగు 16.13లక్షల ఎకరాలకు పెరిగిందని మంత్రి తుమ్మల చెప్పారు. ఎకరాకు సగటు దిగుబడి 26.57 క్వింటాళ్లుగా నమోదవడంతో మొత్తం ఉత్పత్తి 42.87 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా ప్రభుత్వం ఇప్పటికే 4,172.94 కోట్ల గ్యారంటీ ఇవ్వగా, అదనంగా మరో 6.53 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు 1,867.77 కోట్ల బ్యాంకు గ్యారంటీకి కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 354 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే 12.85 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను 2.33లక్షల మంది రైతుల నుంచి సేకరించినట్లు తెలిపారు.
గత ప్రభుత్వం పదేళ్లలో మొక్కజొన్న కొనుగోళ్ల కోసం మొత్తం 5,063 కోట్ల మేర మాత్రమే ఖర్చు చేయగా ప్రజా ప్రభుత్వం మాత్రం రైతుల ప్రయోజనాల కోసం ఈ ఒక్క యాసంగి సీజన్లోనే దాదాపు రూ.6000 కోట్ల మేర వ్యయం చేస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. రైతు సంక్షేమంపై ఎవరికెంత చిత్తశుద్ధి ఉందో ఈ గణాంకాలే చెబుతున్నాయన్నారు. రైతుల వద్దకు ఇప్పుడు వెళ్లి కొందరు రాజకీయ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అయితే, రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
Also Read: మేడ్చల్ హోటల్లో పాకిస్తాన్ ఏజెంట్ కలకలం
మొక్కజొన్న మార్కెట్ ధర క్వింటాకు రూ.1700 నుండి రూ.1850 మధ్య ఉందని మంత్రి తుమ్మల చెప్పారు. ఈ పంట కొనుగోలుకు కేంద్రం స్పందించకపోయినా రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం సీఎం రైతు పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. భారీ దిగుబడులు, కొనుగోలు కేంద్రాలకు పెరిగిన రాకలు దృష్ట్యా జిల్లాల వారీగా అదనపు కొనుగోలు లక్ష్యాలను నిర్ణయించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
జొన్న (హైబ్రిడ్) కొనుగోళ్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో జొన్న ధర క్వింటాకు సుమారు 2వేలు మాత్రమే ఉండగా, కేంద్రం నిర్ణయించిన ఎంఎస్పీ 3,699గా ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.1100 కోట్లకు పైగా వ్యయంతో జొన్న కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4.03 లక్షల ఎకరాల్లో జొన్న సాగు జరిగి 4.03 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉన్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా జొన్న కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఆదిలాబాద్ జిల్లాలో 26 కేంద్రాలు, సంగారెడ్డి జిల్లాలో 10 కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 43 కేంద్రాలు, మెదక్ మరియు వికారాబాద్ జిల్లాల్లో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా జోగులాంబ గద్వాల్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో జొన్న కొనుగోళ్ల కోసం కేవలం 374 కోట్ల మేర మాత్రమే ఖర్చు చేయగార, కాంగ్రెస్ ప్రభుత్వం గత సీజన్లోనే దాదాపు 800 కోట్లతో జొన్న కొనుగోళ్లు చేపట్టిందని తెలిపారు.
Also Read: ట్రంప్ చుట్టూ మృత్యువలయం.. ఐదు నెలల్లో 3 దాడులు.. అసలు సూత్రధారి ఎవరు?
ప్రస్తుతం మరో 1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు సిద్ధమవుతోందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు వారి దగ్గరకు వెళ్లి రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం బాధాకరమన్నారు. రైతుల కోసం పని చేసే ప్రభుత్వం ఒక్కటే ఉందని, అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
పొద్దుతిరుగుడు పంట విషయంలో కేంద్ర ప్రభుత్వం కేవలం 25 శాతం కొనుగోలు పరిమితి మాత్రమే అనుమతించిందని మంత్రి తుమ్మల చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ పరిమితికి మించి కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు ఎంఎస్పీ క్వింటాకు 7,721 రూపాయలు ఉండగా మార్కెట్ ధర 5,376 రూపాయలుగా మాత్రమే ఉండటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి పంపిన ప్రతిపాదనలతో పాటు రాష్ట్ర పూల్ ద్వారా అదనంగా 10,175 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్లో ధరలు స్థిరీకరించడం, రైతు ఆదాయాన్ని రక్షించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమని, కేంద్రం స్పందించకపోయినా రైతులను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేయదని పేర్కొన్నారు.
Also Read: దౌల్తాబాద్లో ఎరువుల దందా.. రైతుల రక్తం తాగుతున్న బ్లాక్ మార్కెట్ గ్యాంగ్!