Transfer Ban: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం మళ్లీ పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. గత నెల మే 1 నుండి మే 31 వరకు బదిలీలకు ఇచ్చిన సడలింపు గడువు ముగియడంతో, 1 జూన్ 2026 నుండి ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జీఓ ఎంఎస్ నంబర్ 57 విడుదల చేశారు.వచ్చే ఆరు నెలల పాటు బదిలీల సడలింపునకు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలను కూడా శాఖలు స్వీకరించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే ప్రమోషన్ పొందిన ఉద్యోగులకు ఖాళీలు ఉన్న చోట పోస్టింగ్ ఇవ్వవచ్చు.ఇక పోస్టుల రద్దు ,రివర్షన్లు, డిప్యుటేషన్లు (ఫారిన్ సర్వీస్ మాత్రమే), క్రమశిక్షణా చర్యల వల్ల వచ్చే మార్పుల ప్రకారం ఖాళీలలో పోస్టింగ్ ఇవ్వవచ్చు.6 నెలల కంటే ఎక్కువ కాలం సుదీర్ఘ సెలవుపై వెళ్లి తిరిగి వచ్చిన వారికి ఖాళీగా ఉన్న చోట పోస్టింగ్ ఇవ్వవచ్చు.అయితే 6 నెలల లోపు ఆర్జిత పరిపాలనా సామర్థ్యం కోసం తప్పనిసరిగా భర్తీ చేయాల్సిన ఖాళీలు ఉంటే, ప్రస్తుతం పనిచేస్తున్న స్థానంలో కనీసం ఒక ఏడాది యాక్టివ్ సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రాబోయే 6 నెలల వరకు బదిలీల సడలింపు ప్రతిపాదనలను ఏ శాఖా కూడా పరిశీలించరాదు.
Also Read: హైదరాబాద్లో సాయంత్రం పవన్ మీడియా సమావేశం, దీనికైనా పోలీసులు పర్మిషన్ ఇస్తారా?
ఆ తర్వాత ఒకవేళ అత్యవసరంగా బదిలీల నిషేధాన్ని సడలించాల్సి వస్తే.. సచివాలయ పరిపాలనా శాఖ ఫైలును ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , సంబంధిత శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ద్వారా సీఎంకు సర్క్యులేషన్కు పంపి ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది.ప్రభుత్వం జారీ చేసిన ఈ బదిలీల నిబంధనలకు విరుద్ధంగా ఎవరినైనా బదిలీ చేస్తే, సదరు ఉద్యోగుల జీతాల బిల్లులను ఆమోదించవద్దని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ , డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్లను ప్రభుత్వం కఠినంగా ఆదేశించింది. అన్ని సచివాలయ విభాగాలు, శాఖాధిపతులు, మరియు జిల్లా కలెక్టర్లు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read: జూన్ 8 నుంచి కుంభవృష్టి వర్షాలు.. ముందే చెరువులు ఖాళీ చేయిస్తున్న హైడ్రా బాస్!