Telangana Govt: ఇంజనీరింగ్, వృత్తి విద్య కోర్సులపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. కాలేజీ నుంచి విద్యార్థులు బయటకు రాగానే ఉద్యోగం వచ్చేటట్లుగా ఉండాలని ఆలోచన చేస్తోంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఐదు కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది.
ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. దీని ఫలితంగా పట్టా పుచ్చుకుని బయటకు వస్తున్న విద్యార్థులకు.. ఉద్యోగాలు దొరక్క చాలామంది సతమతమవుతున్నారు. చాలా కాలేజీల్లో కనీస సదుపాయాలు ఉండడం లేదు. మరికొన్నింటిలో బోధించే సిబ్బంది లేని సందర్భాలు ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నాయి. ఆ సమస్యలు లేకుండా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రతీ మూడేళ్లకు ఒకసారి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2025 ఏడాది ఫీజులు పెంచాల్సివున్నా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఫీజుల నిర్ధారణకు కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలోని ఓ కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.
వాటి ఆధారంగా విద్యాశాఖ కార్యదర్శి కొత్త మార్గ దర్శకాలను విడుదల చేశారు. ఇప్పటివరకు కాలేజీలు సమర్పించిన ఆడిట్ నివేదికల ఆధారంగా ఫీజులను ఖరారు చేసేవారు. ఇకపై ఐదు అంశాల ఆధారంగా ఖరారు చేయనుంది ఫీజుల నియంత్రణ కమిటీ. కొత్త నిబంధనల అమలు చేసిన కాలేజీలు మాత్రమే ఫీజుల్లో పెంచుకునే అవకాశం ఉంటుంది.
ALSO READ: తెలంగాణలో కొత్త రేషన్ దారులకు శుభవార్త.. వెంటనే చెక్ చేయండి?
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ వల్ల ఇంజనీరింగ్ కళాశాలలు తప్పనిసరిగా నాణ్యమైన విద్య అందించాలి. అలాగే పరిశోధనలు, స్టార్టప్లు వాటికి ప్రయార్టీ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూ లను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారు నేర్చుకునేందుకు యాజమాన్యాలు మద్దతు ఇవ్వాలి.
విద్యార్థుల హాజరు, ఫేషియల్ రికగ్నేషన్ అమలు, ఆధార్ ఆధారిత ఫీజుల చెల్లింపులు అనే అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్టు కొత్త రూల్స్లో ప్రస్తావించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాలేజీల ర్యాంకింగ్ సత్తా చాటాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంకేతిక విద్యాశాఖ కోరిన ప్రణాళికలను తప్పకుండా అమలు చేయాలి.
పై నిబంధనలను అమలు చేసినవారు మాత్రమే ఫీజులకు పెంచుకునేందుకు అందుకు సంబంధించిన కమిటీ గ్రీన్సిగ్నల్ ఇవ్వనుంది. ఫీజుల పెంపుపై ప్రభుత్వం కొత్త నిబంధనలు రావడంతో మళ్లీ ప్రక్రియ మొదటి నుంచి ప్రారంభంకానుంది. తెలంగాణ వ్యాప్తంగా 160 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ యాజమాన్యాలు తమ ఎదుట హాజరై వివరాలు సమర్పించాలని ఫీజుల నియంత్రణ కమిషన్-ఎఫ్ఆర్సీ పేర్కొంది. ఈ మేరకు అన్ని కాలేజీలకు పంపిన లేఖల్లో ప్రస్తావించింది. ఈ నెల 25 నుంచి కాలేజీల నుంచి దరఖాస్తులు తీసుకోనుంది. సెప్టెంబరు 3 వరకు వాటిని స్వీకరిస్తారు.
ఆయా కళాశాలల ప్రతినిధులు అంగీకరిస్తే వారి నుంచి సంతకం తీసుకుంటారు. అభ్యంతరాలు చెబితే వాటిని పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ తర్వాత కళాశాల వారీగా ఫీజుల జాబితాను ప్రభుత్వానికి పంపిస్తారు. కొత్తగా ఖరారు చేసే ఫీజులు 2026 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్లపాటు అమల్లో ఉంటాయి.