Telangana Govt: దివ్యాంగుల సంక్షేమం కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రెట్టింపు చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ జీవో విడుదల చేశారు. ఈ ప్రొత్సాహం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్దాం.
దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు
దివ్యాంగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కృత్రిమ అవయవాలు, ట్రై సైకిళ్లు, వీల్ చైర్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఓవైపు సామాజిక భద్రత కల్పిస్తూ మరోవైపు వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం మరో నిర్ణయం తీసుకుంది. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు కింద ఇచ్చే నగదును భారీగా పెంచింది. ఇప్పటివరకు లక్ష రూపాయలు వచ్చేది. ఏకంగా రెండు లక్షలకు పెంచింది. ఈ మేరకు శనివారం ఆ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త దంపతులకు శుభవార్త, ఏకంగా రెండు లక్షలు మీ సొంతం
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దివ్యాంగుల జీవితాల్లో సామాజిక భద్రతతోపాటు ఆర్థిక భరోసా కల్పించాలని రేవంత్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద నిర్దేశించిన ప్రమాణాలను కలిగి ఉన్న కొత్త జంటలకు సవరించిన ప్రోత్సాహకం వర్తిస్తుంది. వైకల్య స్థితి, వివాహ నమోదుకు సంబంధించిన పత్రాల ధృవీకరణ పత్రాలు జిల్లా అధికారులకు అందజేయాలి.
వాటిని పరిశీలించిన తర్వాత అప్పుడు జిల్లా స్థాయిలో ఓకే అవుతుంది. అందుకు అనుగుణంగా ఈ మొత్తాన్ని విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ నగదును ప్రభుత్వం నేరుగా భార్య పేరిట బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. పెళ్లి తర్వాత కొత్తగా జీవితాన్ని ప్రారంభించే దివ్యాంగ దంపతులకు ఇల్లు, వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం సహాయంగా ఉంటుందని ప్రభుత్వం ఆలోచన.
ALSO READ: వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి.. లేదంటే కోర్టుకే, బండి సంజయ్, అర్వింద్లకు కేటీఆర్ లీగల్ నోటీసులు!
కొత్త జంట ఆర్థికంగా నిలదొక్కు కొనేందుకు సాయం చేయాలని వికలాంగుల సంక్షేమ శాఖ, ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం. చివరకు ఫైనాన్స్ శాఖ అనుమతి ఇవ్వడంతో భారీ పెంచింది. 2018 వరకు దివ్యాంగులు-సకలాంగులు వివాహం చేసుకుంటే 50 వేలు మాత్రమే ఇచ్చేది. గత ప్రభుత్వం లక్షకు పెంచింది.
ప్రస్తుతం వీరికి అందిస్తున్న నగదు ప్రొత్సాహకంలో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో వారికి రెండింతలు అయ్యింది. జనవరి17 నుంచి దివ్యాంగులు వివాహం చేసుకున్న వారికి 2 లక్షలు పారితోషికం అందనుంది. వారి వివాహం జరిగిన ఫోటోలు, అందుకు సంబంధించి పత్రాలను వివాహం జరిగిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.