Land Survey: స్వేచ్ఛ బ్యూరో: దశాబ్దాలుగా పరిష్కారం కానీ భూ వివాదాలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం సరిహద్దులు తెలియక, రికార్డులు ట్యా లీ కాకపోవడం తో వేల ఎకరాల భూమి ‘పంచాయతీ’ల్లో నలుగుతోంది. దీనివల్ల అటు ప్రభుత్వానికి, ఇటు సామాన్య రైతులకు తీరని నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, వివాదాస్పద భూములపై ఉమ్మడి సర్వే నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఒకే భూమిపై రెండు వేర్వేరు శాఖలు తమ హక్కులు కోరుతున్నాయి. ఈ సమన్వయ లోపం వల్ల వేలాది ఎకరాలు వినియోగంలో లేకుండా పోతున్నాయి.
రెవెన్యూ వర్సెస్ ఫారెస్ట్ శాఖ ల మధ్య సరిహద్దు పంచాయతీలు నెలకొంటున్నాయి.అటవీ సరిహద్దు గ్రామాల వద్ద భూమి ఎవరిదో తెలియక ఏళ్ల తరబడి కేసులు నడుస్తున్నాయి. అంతేగాక ఆలయ భూముల గుర్తింపులో స్పష్టత కరువవ్వడం, వక్ఫ్ ఆస్తుల రికార్డులు, రెవెన్యూ రికార్డులతో సరిపోలకపోవడం వంటి సమస్యలు ఏళ్ల తరబడి నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనేఈ భూ చిక్కులను విప్పేందుకు ప్రభుత్వం అన్ని శాఖల అధికారులతో కూడిన ఒక స్పెషల్ కమిటీని సర్కార్ ఏర్పాటు చేస్తోంది.
Also Read: కవితకు ఎన్నికల సంఘం షాక్.. ఆపై పార్టీ పేరు మార్పు, ఈసీ గ్రీన్ సిగ్నల్
సమగ్ర క్షేత్రస్థాయి విచారణ జరుగుతుంది.డిజిటల్ సర్వే పరికరాల సహాయంతో సరిహద్దులను ఖరారు చేస్తారు. శాఖల మధ్య ఉన్న గందరగోళాన్ని తొలగించి, ‘ఉమ్మడి సరిహద్దు నివేదిక’ను రూపొందిస్తారు. ఈ సర్వే వల్ల రైతులకు భూ హక్కులపై స్పష్టత వస్తుంది, క్రయవిక్రయాల్లో ఇబ్బందులు తొలగుతాయి. ప్రభుత్వానికి విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవచ్చు. అభివృద్ధికి వివాదాలు లేని భూములను పరిశ్రమలకు లేదా ప్రజా అవసరాలకు కేటాయించవచ్చు. న్యాయస్థానాలకు కోర్టుల్లో పెండింగ్లో ఉన్న వేలాది భూ వివాద కేసులు పరిష్కారమవుతాయి.
గతంలో అడపాదడపా సర్వేలు చేసినా, అవి కేవలం ఒక్కో శాఖ విడివిడిగా చేయడం వల్ల ఫలితం లేకపోయింది. ఇప్పుడు “ఉమ్మడి సర్వే” విధానం ద్వారా ఒకేసారి అందరి సమక్షంలో సరిహద్దులు నిర్ణయించడం వల్ల భవిష్యత్తులో మళ్లీ వివాదాలు తలెత్తే అవకాశం ఉండదు.ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం క్షేత్రస్థాయిలో సక్సెస్ అయితే, రాష్ట్రంలో భూ పరిపాలనలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. దశాబ్దాల ‘భూ పంచాయతీ’లకు శాశ్వత విముక్తి లభిస్తుంది.
Also Read: రైతు రుణమాఫీపై హైకోర్టుకు హరీశ్ రావు.. ధర్మాసనం సంచలన ఆదేశాలు