తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా నిలిచిపోయిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిల కోసం ఆర్థిక శాఖ రూ.1,000 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2025 అక్టోబర్ వరకు పేరుకుపోయిన బకాయిలను ఈ నిధులతో పూర్తిగా క్లియర్ చేయనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వేలాది మంది మాజీ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల నిలిచిపోయిన ఈ నగదు ఇకపై నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరనుంది.
బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై ఇటీవల తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర మంత్రివర్గం రాబోయే 100 రోజుల్లోగా విశ్రాంత ఉద్యోగుల క్లెయిమ్ల కోసం సుమారు రూ.6,200 కోట్లు చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ రిసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీ’ని కూడా ఏర్పాటు చేసింది. నిధుల సమీకరణలో భాగంగా మంత్రులు ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం నిలుపుదల చేసి ఆ మొత్తాన్ని కూడా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసమే మళ్లించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
కేవలం పాత బకాయిలే కాకుండా భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియ వేగవంతం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి నెలా చేసే చెల్లింపుల పరిమితిని మరో రూ.1,000 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ మార్పు వల్ల ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు క్లెయిమ్లు ఇకపై పెండింగ్లో ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కారమవుతాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూనే ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని వారు పేర్కొంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు భరోసా కల్పిస్తూ తీసుకున్న ఈ అడుగు రాష్ట్ర పరిపాలనలో కీలకమైన మార్పుగా కనిపిస్తోంది.
ALSO READ: కవిత పార్టీ పెద్ద జోక్..రాజకీయ లబ్ది కోసమే, కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడ? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి