తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఖరీఫ్ సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బోనస్ నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రూ. 514.36 కోట్ల భారీ నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్వింటాలుకు రూ. 500 చొప్పున ఈ బోనస్ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్’ (DBT) పద్ధతిలో జమ చేయనున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.17 లక్షల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. గత కొంతకాలంగా బోనస్ బకాయిల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ నిధుల విడుదల పెద్ద ఊరటనిచ్చింది. ఈ దఫా విడుదల చేసిన నిధులతో కలిపి, ఇప్పటివరకు ప్రభుత్వం రైతులకు చెల్లించిన మొత్తం బోనస్ విలువ రూ. 1,939.58 కోట్లకు చేరుకుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అదనపు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది.
తెలంగాణలో సన్న బియ్యం సాగును భారీగా పెంచాలనే సంకల్పంతో ప్రభుత్వం కనీస మద్దతు ధర (MSP) కంటే అదనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటిచింది. సాధారణ రకాల కంటే సన్న రకాలకు మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ పెట్టుబడి ఖర్చు దృష్ట్యా రైతులు వెనకడుగు వేయకుండా ఈ ప్రోత్సాహకం తోడ్పడుతోంది. ప్రభుత్వ లక్ష్యం కేవలం గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన సన్న బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం కూడా అని అధికారులు వెల్లడించారు.
తాజా నిధుల విడుదలతో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బోనస్ బకాయిలు దాదాపు పూర్తిగా క్లియర్ అయ్యాయని సివిల్ సప్లైస్ శాఖ తెలిపింది. రైతులు తమ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోవాలని.. ఒకవేళ నిధులు జమ కావడంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంబంధిత ధాన్యం కొనుగోలు కేంద్రాలను (PPC) లేదా జిల్లా సివిల్ సప్లైస్ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు రైతులకు సకాలంలో చెల్లింపులు జరపడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అదనపు బోనస్ నిధుల విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇటువంటి చర్యలు దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.