Doctor Transfers: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియ ప్రస్తుతం గందరగోళంగా మారింది. ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల జీవో వైద్య ఆరోగ్యశాఖ వంటి అత్యవసర సెక్టార్కు సరిపోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ గెజిటెడ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఈ ప్రక్రియలోని లోపాలను ఎత్తిచూపుతూ, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఆరోగ్య శాఖ లో సొంత గైడ్లైన్స్ రూపొందించాలని కోరుతున్నారు.ఇతర శాఖలకు, వైద్యారోగ్య శాఖలకు చాలా వ్యత్యాసం ఉంటుందని డాక్టర్ ల సంఘం రిక్వెస్ట్ చేస్తున్నది. ప్రభుత్వం డిజిటల్ పరిపాలనలో భాగంగా ఆన్లైన్ కౌన్సెలింగ్ను ప్రవేశపెట్టినప్పటికీ, అది ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. సాంకేతిక లోపాలు, లాగిన్ సమస్యలు ఒకవైపు.. సీనియారిటీ జాబితాలో అస్పష్టత మరోవైపు వైద్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ముఖ్యంగా వెయిటేజీ మార్కులు, సీనియారిటీ గణన, తుది కేటాయింపుల్లో పారదర్శకత లేకపోవడం వల్ల అర్హులైన వారికి అన్యాయం జరుగుతోందనీ సంఘం కోరుతున్నది.అత్యంత కష్టతరమైన ప్రాంతాల్లో , క్లిష్ట పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యులకు బదిలీల్లో సరైన ప్రాధాన్యత లభించడం లేదని సంఘం వెల్లడిస్తున్నది.
ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు, బదిలీల వల్ల ఏర్పడే ఖాళీలన్నింటినీ ప్రదర్శించకపోవడం వల్ల వైద్యులకు ఐచ్ఛికాల ఎంపికలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనితో పాటు గుర్తింపు పొందిన సంఘాల పదాధికారులకు బదిలీల నుంచి మినహాయింపు , రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనితో పరిష్కారం దిశగా అడుగులు పడాలనీ సంఘం కోరుతున్నది. వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలు కేవలం ఒక పరిపాలనా ప్రక్రియ మాత్రమే కాదు, అది ప్రజారోగ్య సేవలను ప్రభావితం చేసే అంశం గా టీ జీ డీ ఏ వివరిస్తున్నది.
Also Read: 40 ఏళ్ల నాటి రైల్వే రిజర్వేషన్ సిస్టమ్కు గుడ్బై.. AI ఆధారిత టికెట్ సేవలు వచ్చేస్తున్నాయ్!
ప్రస్తుత ఆన్లైన్ బదిలీ విధానంలో ఉన్న లోపాలను సరిదిద్దాలనీ సంఘం కోరుతున్నది.అవసరమైతే పూర్తి పారదర్శకత కోసం ‘ఫిజికల్ కౌన్సెలింగ్’ నిర్వహించాలి. అన్ని ఖాళీలను చూపాలనీ ,ఏర్పడబోయే ఖాళీలతో సహా అన్నింటినీ వెబ్సైట్లో ఉంచాలనీ డాక్టర్ ల సంఘం చెబుతున్నది.అంతే గాక బదిలీల ప్రక్రియలో తలెత్తే అభ్యంతరాలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించేందుకు ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉన్న డాక్టర్ల సంఘాల ప్రతినిధులను బదిలీల ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలనీ స్పష్టం చేస్తున్నారు…వైద్యులు రాత్రింబవళ్లు ప్రజలకు సేవ చేసే అత్యవసర విభాగం ఇది అని,ఇక్కడ బదిలీల ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉంటే, అది వైద్యుల మానసిక స్థితిపై, తద్వారా రోగులకు అందే సేవలపై ప్రభావం చూపుతుందనీ వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, వైద్యుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని, న్యాయం, నమ్మకం, పారదర్శకత ప్రాతిపదికన బదిలీలను పూర్తి చేయాలని డాక్టర్ ల సంఘం డిమాండ్ చేసింది.”వైద్యుల సమస్యలను పరిష్కరించడం అంటే ప్రజారోగ్యాన్ని కాపాడటమే. ప్రభుత్వం మొండివైఖరి వీడి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా గైడ్ లైన్స్ మార్చాలి.” అని వైద్య సంఘాల ప్రతినిధులు సర్కార్ పై ఒత్తిడి తెస్తున్నారు.