Bandi Bhagirath: స్వేచ్చ బ్యూరో: పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయ్యింది. మైనర్ అయిన తన కూతురిపై బండి భగీరథ్ లైంగిక దాడులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై పేట్ బషీరాబాద్ పోలీసులు అతనిపై పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసులు నమోదు కాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బండి భగీరథ్ ను ఆ తరువాత అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి బండి భగీరథ్ చర్లపల్లి జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉంటున్నాడు. కాగా, ఇటీవల తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ బండి భగీరథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తనపై నమోదు చేసిన కేసు రాజకీయ ప్రేరేపితమైందని పేర్కొన్నారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. దీనిపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా బాధితురాలి తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేయవద్దన్నారు. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. బండి భగీరథ్ తండ్రి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న నేపథ్యంలో కేసుపై ప్రభావం పడే అవకావం ఉందన్నారు. దర్యాప్తు దశలో బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. కేసులో ఇంకా సాక్షులను విచారించాల్సి ఉందన్నారు. బెయిల్పై బయటకు వస్తే సాక్షులు స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Also Read: POCSO Cases: తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తున్న పోక్సో కేసులు.. లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే..?
బండి భగీరథ్ జైల్లో ఉన్నప్పుడే కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందని వాదనలు వినిపించారు. బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేస్తే కేసుపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయంటూ పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా కోర్టుకు కౌంటర్ సమర్పించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్న క్రమంలో తీవ్రమైన ఆరోపణలు రావటంతో కేసులో అదనంగా రెండు సెక్షన్లను చేర్చినట్టు కౌంటర్లో పేర్కొన్నారు. ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ స్నేహం పేరుతో బండి భగీరథ్ బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడులు జరిపినట్టు చెప్పారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన నేపథ్యంలో బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
Also read: Allu Arjun: బన్నీ ఏ11 నిందితుడా?.. ఛార్జ్షీట్తో అల్లు అర్జున్కు బిగుస్తుకున్న ఉచ్చు!