Allu Arjun: స్వేచ్చ బ్యూరో: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఉదంతంపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ జరిపింది. కేసులో నిందితునిగా ఉన్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కోర్టు అనుమతితో ఈసారి కూడా వర్చువల్ గానే విచారణకు హాజరయ్యారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా 2024, డిసెంబర్ 4న అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కు వచ్చిన విషయం తెలిసింది. ఈ విషయం తెలిసి వేలాది మంది అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. కారులో నుంచి దిగి అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళుతుండగా ఆయనను దగ్గరగా చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు.
దాంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఇప్పటికీ చికిత్స పొందుతున్నాడు. దీనిపై చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుల జాబితాలో అల్లు అర్జున్ ఏ11గా ఉన్నారు. త్వరలోనే కేసులో ట్రయల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటీవల నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ తోపాటు పంథొమ్మిది మంది నిందితులకు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించింది. అయితే, సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్ ముంబైలో ఉన్నాడని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు వర్చువల్ గా విచారణ జరిపింది.
Also read: Sugali Preethi: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు!
కాగా, ఇదే కేసులో కోర్టు సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈసారి కూడా అల్లు అర్జున్ వర్చువల్ గానే విచారణకు హాజరయ్యాడు. కాగా, కేసులోని మరికొందరు నిందితులు వ్యక్తిగత కారణాలతో విచారణకు రాలేదు. దాంతో కోర్టు కేసు విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఇక, కేసుకు సంబంధించి అయిదు వందల పేజీల ఛార్జ్ షీట్ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు అందచేశారు.
Also read: అమెజాన్ సేల్ ధమాకా.. OnePlus 13 ధర భారీగా తగ్గింపు, పూర్తి ఆఫర్ వివరాలు ఇవే!