తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఫలితాలను కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ’ వేదికగా అధికారిక వివరాలను వెల్లడించింది. ప్రతి ఏటా ఫలితాల వెల్లడి అనేది జవాబు పత్రాల మూల్యాంకనం పైన ఇతర సాంకేతిక అంశాల పైన ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా ఒక నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని అధికారులు వివరించారు.
గత రికార్డులను పరిశీలిస్తే ఎప్పుడూ కూడా ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కాలేదని విద్యాశాఖ గుర్తు చేసింది. 2014 నుండి 2025 వరకు ఫలితాలు విడుదలైన తేదీలను ఇంటర్మీటియట్ బోర్డు వివరించింది. ఇందులో చాలా సందర్భాల్లో ఫలితాలు ఏప్రిల్ మూడవ వారంలో వచ్చినట్లు స్పష్టమవుతోంది. కోవిడ్ సమయంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ సాధారణ పరిస్థితుల్లో ఫలితాల వెల్లడికి తగిన సమయం పడుతుందని పేర్కొంది. తప్పుడు వార్తలు నమ్మి విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించింది.
కేవలం సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను చూసి నిర్ణయానికి రావద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. ఇంటర్ విద్యామండలి ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరింది. ఫలితాల వెల్లడి తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. పారదర్శకంగా ఫలితాల విడుదల ప్రక్రియను పూర్తి చేసేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది.
ALSO READ: మావిగన్కు రాష్ట్రంలో భారీ స్పందన.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్, బొత్స సంచలన వ్యాఖ్యలు