MGNREGA: స్వేచ్ఛ బ్యూరో: ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. కూలీల హాజరును ఆన్లైన్లో ఫేస్ అథెంటికేషన్ (ముఖ గుర్తింపు)తోనే నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగే పనుల్లో అవకతవకలను అరికట్టేందుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సర్క్యులర్ జారీ చేసింది.
కమ్యూనిటీ పనులకు సంబంధించి ఇప్పటికే మార్చి 2 నుంచి ఫేస్ అథెంటికేషన్ విధానం అమల్లోకి వచ్చింది. దీనిని వ్యక్తిగత లబ్ధిదారుల పనులకు వర్తింపజేయబోతున్నారు. ప్రతిరోజూ 100 శాతం హాజరును ఆన్లైన్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. ఉపాధి కూలీలందరికీ ఈ-కేవైసీ పూర్తిచేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. కూలీల ముఖగుర్తింపు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఫీల్డ్ స్థాయిలో హాజరు నమోదు ప్రక్రియలో వర్కింగ్ మేట్లు కీలక పాత్ర పోషించనున్నారు.
Also Read: 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కన్నీటి కృతజ్ఞతలు.. ఎందుకంటే..?
జాబ్ కార్డు కలిగిన వారినే మేట్లుగా గుర్తించాలని, వీరిలో కనీసం 50 శాతం మహిళలు ఉండాలని పేర్కొంది. మేట్లందరికీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉండాలని, వారికి బ్లాక్ లెవల్లో ఎన్ఎంఎంఎస్ యాప్ వాడకంపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి మేట్ కనీసం 40 మంది కూలీల హాజరును పర్యవేక్షించాలని, రోజుకు రెండుసార్లు ఫేస్ అథెంటికేషన్ ద్వారా హాజరును అప్లోడ్ చేయాలని గైడ్లైన్స్ జారీ చేసింది. ఈ విధానాన్ని అమలు చేసే బాధ్యతను కలెక్టర్లు, డీపీసీలకు అప్పగించింది. నిరంతరం మానిటరింగ్ చేస్తూ, ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు.
Also Read: అనుకున్నది ఒకటి అయినది మరొకటి.. గలాబీలో ఇప్పుడిదే హట్ టాపిక్..?