Telangana Jagruthi: తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సమరంలో ‘తెలంగాణ జాగృతి’ తనదైన ముద్ర వేసింది. కేవలం సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన ఉనికిని చాటుకుంది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. వివిధ గ్రామాల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఐదుగురు ఘన విజయం సాధించి, సర్పంచ్ పీఠాలను కైవసం చేసుకోవడం ద్వారా సంస్థ ఎన్నికల ఖాతాలో బోణీ కొట్టింది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగిన పోలింగ్లో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు తెలంగాణ జాగృతి మద్దతుదారులు కూడా పోటీలో నిలిచారు. ఈ క్రమంలో ఐదు కీలక గ్రామాల్లో జాగృతి మద్దతుతో బరిలోకి దిగిన వారు విజయం సాధించడం విశేషం. తాడిబిలోలి గ్రామ సర్పంచ్గా శంకర్ విజయం సాధించగా, మినార్పల్లి సర్పంచ్గా తారా చంద్ గెలుపొందారు. అలాగే, గిరిజన ప్రాంతమైన విరన్నగుట్ట తండాలో సుమలత జాదవ్ సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు.
మరోవైపు రాంపూర్ గ్రామంలో కమలాకర్ సర్పంచ్గా ఎన్నికవగా, రెంజల్ గ్రామ సర్పంచ్గా తిరుపతి లలిత హన్మాండ్లు ఘన విజయం సాధించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్లే తమ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారని జాగృతి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఐదుగురు సర్పంచ్ల గెలుపుతో ఆయా గ్రామాల్లో జాగృతి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
నిజామాబాద్ జిల్లా కవితకు కంచుకోటగా ఉంది. గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచే జాగృతి ద్వారా ఆమె ఇక్కడ బలమైన క్యాడర్ను నిర్మించుకున్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మహిళల్లో, నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతలో ఆమెకు ప్రత్యేక ఆదరణ ఉంది. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆమె పట్టు ఏమాత్రం తగ్గలేదని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో రాజకీయంగా పలు సవాళ్లు ఎదుర్కొన్న కవితకు.. తన సొంత గడ్డపై జాగృతి అభ్యర్థుల గెలుపు నైతిక బలాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.