Sports Budget: స్వేచ్చ బ్యూరో: క్రీడాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రగతిపద్దు కింద రూ.500 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించింది. గతేడాది కంటే రూ.35 కోట్లు అదనంగా ప్రతిపాదించింది. ఇదిలా ఉండగా రాష్ట్రాన్ని 2047 నాటికి దేశానికి స్పోర్ట్స్ క్యాపిటల్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ లో రాష్ట్ర నూతన క్రీడావిధానాన్ని ప్రభుత్వం ఆవిష్కరించింది.
రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి 9 కీలక ఎంవోయూలు కుదుర్చుకుంది. ఇదిలా ఉండగా నూతన క్రీడావిధానం ద్వారా చిన్న వయసులోనే అట్టడుగుస్థాయి(గ్రాస్ రూట్) నుంచి ప్రతిభావంతులను గుర్తించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ప్రభుత్వ పనిచేస్తోంది. ఇందులోభాగంగా, గత రెండేళ్లుగా పారా స్పోర్ట్స్తో సహా 40 క్రీడావిభాగాల్లో సీఎం కప్ టోర్నమెంట్లను నిర్వహిస్తోంది. వాటిలో విశేష ప్రతిభ కనబరిచిన పిల్లలను గుర్తించి వారికి ఉన్నతస్థాయి శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర యువత క్రీడా రంగంలో ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి వీలుగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది.
Also read: Telangana Economy: తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలు విడుదల చేసిన ప్రభుత్వం
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని, రేవంత్ రెడ్డి క్రీడా ప్రోత్సాహకుడు అనేందుకు బడ్జెట్టే నిదర్శనమమని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. క్రీడారంగానికి రూ.500 కోట్లు బడ్జెట్ కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటాలకు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు ఎనలేని ప్రాధాన్యత లభిస్తోందని కొనియాడారు.
కేసీఆర్ పాలనలో క్రీడలకు మొత్తం కలిపి రూ.150 కోట్లు కేటాయింపులు కూడా సరిగ్గా జరగలేదని విమర్శించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఏటా కేటాయింపులు పెరుగుతూనే ఉన్నాయన్నారు. పెరిగిన క్రీడల బడ్జెట్ తో రాష్ట్రంలో క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్ స్కూళ్ల సంఖ్య పెంపునకు ఆస్కారముందన్నారు. అకాడమీ, స్కూళ్లలో నాణ్యత గల క్రీడా శిక్షణ అందించడం, నియోజకవర్గ కేంద్రాల్లో స్టేడియాల నిర్మాణం, వివిధ క్రీడా కార్యక్రమాలకు ఈ బడ్జెట్ ను వినియోగిస్తామని తెలిపారు. ఈ వేడుకల్లో డిప్యూటీ డైరెక్టర్లు సుజాత రవీందర్, స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు రవికుమార్, గోకుల్, మధు, పీఆర్వో కాలేరు సురేశ్, ఎల్బీ స్టేడియం కోచ్ లు, సిబ్బంది క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.