Uttam Kumar Reddy irrigation review: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చెరువుల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కమిటీల్లో కేవలం అధికారులు మాత్రమే కాకుండా రైతులు, స్థానిక భాగస్వాములు సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో చెరువుల పరిస్థితిని పర్యవేక్షించడం, అభివృద్ధి పనులను సమన్వయం చేయడం ఈ కమిటీల ప్రధాన బాధ్యత. ఈ వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ చెరువుల్లో పూడికతీత పనులను అత్యవసర ప్రాధాన్యతగా చేపట్టాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే అన్ని చెరువుల్లో పనులు మొదలుపెట్టి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
చెరువుల ప్రస్తుత పరిస్థితి, వాటి పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలపై రైతు కమిషన్ అందించిన సమగ్ర నివేదికను మంత్రి అభినందించారు. కమిషన్ చేసిన ప్రతిపాదనలు ఆచరణాత్మకంగా ఉన్నాయని పేర్కొన్న ఆయన.. వీటిని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులను కేటాయించేలా చూస్తానని భరోసా ఇచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న చెరువులను బాగు చేయడం ద్వారా సాగునీటి కష్టాలు తీరడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: త్వరలో కొత్త పథకాల అమలుకు శ్రీకారం: మంత్రి కోమటి రెడ్డి..!