MCH Kits: స్వేచ్ఛ బ్యూరోొ: గత ప్రభుత్వానికి కీలక పేరు తీసుకువచ్చిన ఎంసీహెచ్ కిట్ల శారీలు వెనక్కి పంపాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన శారీలు సుమారు గత ఏడాది నుంచి గోడౌన్ లలోనే మూలుగుతున్నాయి. ఇప్పటికే చాలా చీరలు డ్యామేజ్ దశకు చేరాయని అధికారులు ఇటీవల గుర్తించారు. ఇదే విషయాన్ని టీజీఎంఎస్ ఐడీసీ ఆఫీసర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో తిరిగి వెనక్కి పంపాలని హైయ్యర్ ఆఫీసర్ల నుంచి ఆదేశాలు అందాయి. ఆయా చీరలను సప్లై చేసిన వెండర్లకు పంపించాలని నిర్ణయించారు. ఒక్కో కిట్ కు రెండు చీరలు చొప్పున మూడు కీలక వెండర్ల నుంచి గతంలో సుమారు 62 వేల చీరలను వైద్యారోగ్యశాఖ కొనుగోలు చేసింది. ఒక్కో చీరను 5 శాతం జీఎస్టీతో కలిపి రూ. 262.50 లకు కొనుగోలు చేశారు. అంటే కోటి 62 లక్షల 75 వేలను ఖర్చు పెట్టగా, ఈ చీరలన్నీ ఆయా వెండర్లకు వెనక్కి పంపనున్నారు.
గత ప్రభుత్వంలో అత్యంత ప్రజాదరణ పొందిన పథకంగా ఎంసీహెచ్ కిట్ కు పేరుంది. దేశవ్యాప్తంగానూ కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థల నుంచి ప్రశంసలు అందుకున్నాయి. కానీ ఇప్పుడు ఆ ‘ఎంసీహెచ్ కిట్’ (కేసీఆర్ కిట్) పథకం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నిరుపేద గర్భిణీలకు అండగా నిలిచే ఈ పథకంలో భాగంగా పంపిణీ చేయాల్సిన వేలాది చీరలను వెనక్కి పంపాలని అధికారులు నిర్ణయించడంతో ఇక ఆ కిట్ ను తిరిగి అందించే ఆస్కారం లేదని స్పష్టమవుతున్నది. ఈ కిట్ ను ప్రారంభిస్తే ప్రభుత్వానికి మరింత మైలేజ్ వస్తుందని అధికారులు కూడా ఓ సర్వే నిర్వహించి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. కానీ సర్కార్ నుంచి అధికారికంగా ఎలాంటి ఆదేశాలు ఇప్పటి వరకు అందలేదు.
Also read: యూట్యూబ్ టిప్స్.. 500 సబ్స్క్రైబర్లు ఉన్నా ఇక డబ్బులొస్తాయ్, ఇలా చేస్తే చాలు!
ఈ పథకాన్ని తిరిగి పు:నప్రారంభించేందుకు సర్కార్ మొగ్గు చూపడం లేదని స్వయంగా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రధానంగా బడ్జెట్ కొరతతో పాటు గతంలో పెండింగ్ లో బిల్లులు ఇప్పటికీ క్లియర్ కాలేదు. నిధులు సమకూరకపోవడంతో పెండింగ్ బిల్లులు క్లియర్ చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే పలు రివ్యూల్లో ఈ కిట్ పై ప్రస్తావన వచ్చినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఆఫీసర్లకు ఎలాంటి కమ్యూనికేషన్ జరగలేదు. ప్రభుత్వం కూడా ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ కీలక పథకం అటకెక్కినట్లేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి.మరోవైపు బకాయిలు చెల్లించే వరకు కొత్తగా సరఫరా చేయలేమని వెండర్లు సైతం మొండికేస్తున్నారు. ఇప్పటికే కిట్లలో చేర్చాల్సిన ఇతర వస్తువులు, ఆహార పదార్ధాలను సైతం ఇప్పటికే ఆఫీసర్లు వెండర్లకు పంపించినట్లు తెలిసింది.
గతంలో ప్రభుత్వాసుపత్రులలో ఈ కిట్లను పంపిణీ చేయడం వలన గైనిక్ వార్డులన్నీ గర్భిణీలతో కళకళలాడేవి. కానీ ఈ కిట్ల నిలిచిపోయిన తర్వాత చాలా మంది గర్భిణీలు మళ్లీ ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేగాక గత ప్రభుత్వ హయాంలో గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా ప్రోత్సహించడంలో ఎంసీహెచ్ కిట్లు కీలక పాత్ర పోషించాయి. శిశు మరణాల రేటును తగ్గించడంతో పాటు, మాతాశిశు సంరక్షణలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సైతం ఈ పథకం పలుమార్లు ప్రశంసలు, అవార్డులను దక్కించుకుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకంపై ఎటూ తేల్చకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది.
వెండర్ చీరల సంఖ్య
అనిత్ టెక్స్ కాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 25000
జయవిలాస్ ఎస్ ఎస్ మిల్స్ 15000
కేంద్రియ బంధార్ 22000
మొత్తం చీరలు 62000
Also Read: శబరిమల కేసులో కీలక మలుపు.. పాత ఆంక్షలకే కేంద్రం జై.. సుప్రీంలో ఆసక్తికర పోరాటం!