Officials Negligence: స్వేచ్ఛ బ్యూరో: అధికారులు తమను లెక్క చేయడం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సీఎల్పీ మీటింగ్ తర్వాత అసెంబ్లీ ప్రాంగణం ముందుకు వచ్చిన ఎమ్మెల్యేలు అంతర్గతంగా ఇబ్బంది పడుతున్న అంశాలను ఆఫ్ ది రికార్డులో వెల్లడించారు. తమ గ్రీవెన్స్ ను క్లియర్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వంటి వాటిలో అధికారులు అలసత్వం వహిస్తున్నట్లు వివరించారు. రెండున్నర ఏళ్లు తర్వాత కూడా ఎమ్మెల్యేలు చెప్పిన వర్క్స్ పూర్తి కాకపోతే జనాల్లో సన్నగిల్లుతున్నామని పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇదే విషయాన్ని ఓ ఎమ్మెల్యే సీఎల్పీ మీటింగ్ లోనూ ప్రస్తావించినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే తమ ప్రాంతానికి బస్సు వేయాలని కోరినా.. అధికారులు స్పందించలేదని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది. తాను సొంత డబ్బులతో బస్సు వేయాలని అనుకున్నా.. అధికారుల నుంచి స్పందన రాలేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సదరు ఎమ్మెల్యే అసెంబ్లీ ప్రాంగణంలో ఆఫ్ ది రికార్డులో స్పష్టం చేశారు. దాదాపు మెజార్టీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు కొందరు ఎమ్మెల్యేలు చెప్పారు. సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికారులపై విమర్శలు చేయడం సహజమే. కానీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలే స్వయంగా ఆఫీసర్ల నిర్లక్ష్య తీరును వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేయడం పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాఫిక్ గా మారింది.
ఇక అసెంబ్లీ ఆఫీసర్లపై కూడా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత సెషన్స్ లో తాము అడిగిన ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానాలు రాలేదని చెప్తున్నారు. అసెంబ్లీలో తాము అడిగే ప్రశ్నలకు అధికారుల నుంచి సరైన సమాధానాలు రావడం లేదని, కనీస సమాచారం ఇవ్వడంలో కూడా జాప్యం చేస్తున్నారని ఎమ్మెల్యేలు సీరియస్ అవుతున్నారు. జీరో అవర్, స్పెషల్ డిస్కషన్ లో అడిగే ప్రశ్నలకు ఆన్సర్లు రాకపోతే ఎలా? అంటూ ఎమ్మెల్యేలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. మంత్రులు నోట్ చేసుకొని అధికారులకు చెప్తున్నా..వారి నుంచి సమాధానాలు సరైన తీరులో రావడం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలని ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. ఇక నియోజకవర్గాల అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలపై ఇచ్చే ఫిర్యాదులు నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని, దీనివల్ల ప్రజల్లో తమ పలుకుబడి తగ్గుతోందని వారు ఆందోళన చెందుతున్నారు.
Also Read: MLA Committees: శాసనసభలో సరికొత్త వ్యూహం.. ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు..?
మరోవైపు తమ నియోజకవర్గ సమస్యలను విన్నవించుకోవడానికి మంత్రులను కలవాలంటే ప్రత్యేక టైం కేటాయించాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. రోటీన్ గా మంత్రులను కలిసి వినతి పత్రాలను అందజేస్తే ఎండార్స్ తర్వాత అవి ఆయా శాఖల టేబుళ్లపై మూలుగుతున్నాయని ఓ ఎమ్మెల్యే చెప్పారు. అధికారులకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా.. పనులు కావడం లేదని చెప్తున్నారని ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల కోసం మంత్రులు వారంలో కనీసం ఒకటి లేదా రెండు రోజులు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని పలువురు ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మరోవైపు మంత్రుల అందుబాటులో ఉన్నప్పటికీ, కొందరు ఆఫీసర్లు కావాలనే తమకు తప్పుడు సమాచారం ఇస్తూ దాటవేస్తున్నారని ఓ ఎమ్మెల్సీ తెలిపారు. అంతేగాక క్షేత్రస్థాయిలో కొందరు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఎమ్మెల్యేల ఫోన్లకు స్పందించడం లేదని, కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదనే విమర్శలు పెరిగాయి.
Also Read: MLA Committees: శాసనసభలో సరికొత్త వ్యూహం.. ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు..?