Telangana Municipal Elections-2026: తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రధాన పార్టీలు. ఎలాగైనా మెజార్టీ వార్డులను కైవసం చేసుకోవాలిన ప్లాన్ చేస్తున్నాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు రకరకాల వ్యూహాలను అవలంబిస్తున్నాయి. తాజాగా వార్డుల ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. ఇంతకీ ఎక్కడో తెలుసా?
తెలంగాణలో వేడెక్కిన మున్సిపల్ ఎన్నికలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ మూడువార్డులను ఏకగ్రీవం చేసుకుంది. వాటిలో మెదక్, మహబూబ్నగర్, రామగుండం కార్పొరేషన్లు ఉన్నాయి. మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. మెదక్ మున్సిపాలిటీ 32వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
కాంగ్రెస్ నుంచి మానస, బీఆర్ఎస్ నుంచి జ్యోతి నామినేషన్ దాఖలు చేశారు. అయితే జ్యోతికి బీఆర్ఎస్ బీఫాం ఇచ్చినా నామినేషన్ ఉపసంహరించుకుంది. చివరకు కాంగ్రెస్ అభ్యర్థి మానసకు మద్దతు ప్రకటించింది. మానస అత్త లక్ష్మి కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసినా తర్వాత ఉపసంహరించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కరే రేసులో ఉండడంతో మాసన ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
బోణీ కొట్టిన కాంగ్రెస్, పలుచోట్ల ఏకగ్రీవాలు
మహబూబ్నగర్ నగర పరిధిలో 58వ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ అభ్యర్థి రమాదేవి ఎంపిక లాంఛనం కానుంది. కాంగ్రెస్ అభ్యర్థి రమాదేవితో పాటు బీజేపీ నుంచి నాగవల్లి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ నాగవల్లి సోమవారం తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. రేసులో కాంగ్రెస్ అభ్యర్థి రమాదేవి మాత్రమే మిగిలారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్లో చేరారు.
రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ బోని కొట్టింది. ఒకటి డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం కానుంది. డివిజన్ కి సంబంధించి ముగ్గురు నామినేషన్ వేశారు. అనుకోకుండా ఇద్దరు అభ్యర్థులు ఉప సంహరించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయ ఎన్నిక సునాయాశం కానుంది.
ALSO READ: పిల్లల భోజనం, వసతి, చదువు విషయంలో రాజీ పడొద్దు
కాంగ్రెస్ అభ్యర్థి విజయ, బీఆర్ఎస్ నుంచి శ్వేత, బీజేపీ నుంచి రీమా బిశ్వాస్ తమ తమ నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తమ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అయితే అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరణ వెనుక రకరకాల వాదనలు లేకపోలేదు. కాంగ్రెస్ నేతలు బెదిరించడం వల్లే నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు చెబుతున్నారు.