TGERC Rules: తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఫిబ్రవరి 5, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, విద్యుత్ స్తంభాలు, లైన్ల కోసం గతంలో వినియోగదారుల నుంచి దూరాన్ని బట్టి వసూలు చేసే అదనపు ఖర్చుల స్థానంలో ఇప్పుడు సరళమైన ఫిక్స్డ్ ఛార్జీల విధానాన్ని ప్రవేశపెట్టారు.
కొత్త నిబంధనల ప్రకారం, విద్యుత్ లైన్ నుంచి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న నివాసాలకు కేవలం లోడ్ ఆధారంగా మాత్రమే ఛార్జీలు ఉంటాయి. ఉదాహరణకు, 1 కిలోవాట్ కనెక్షన్కు రూ. 500, మరియు 1 నుంచి 5 కిలోవాట్ల వరకు గరిష్టంగా రూ. 3,500 మాత్రమే వసూలు చేస్తారు. అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలకు కూడా ఇదే తరహాలో నిర్ణీత రుసుములను ఖరారు చేశారు. రైతులకు కూడా ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. వ్యవసాయ కనెక్షన్ల కోసం కేవలం కిలోవాట్కు రూ. 1,000 చెల్లిస్తే సరిపోతుంది, దీనివల్ల వేలాది రూపాయల అదనపు భారం తప్పుతుంది.
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం, కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే విద్యుత్ లైన్ లేదా ట్రాన్స్ఫార్మర్ నుంచి ఉన్న దూరాన్ని బట్టి అంచనాలు (Estimations) వేసేవారు. వినియోగదారుడి ఇంటికి లైన్ లాగడానికి ఎన్ని స్తంభాలు అవసరమైతే, వాటికయ్యే మొత్తం ఖర్చును వినియోగదారుడే భరించాల్సి వచ్చేది.
ముఖ్యంగా వ్యవసాయ కనెక్షన్ల విషయంలో, మూడు స్తంభాల కంటే ఎక్కువ దూరం ఉంటే దాదాపు రూ. 45,000 వరకు అదనపు భారం (ORC) పడేది. సాధారణ నివాస కనెక్షన్ల కోసం కూడా విద్యుత్ శాఖ అధికారులు వేసే అంచనాల మేరకు వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చేది, ఇది సామాన్యులకు భారంగా మారేది. ఈ పాత విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వం, ఇప్పుడు దూరం కంటే కనెక్షన్ లోడ్కే ప్రాధాన్యత ఇస్తూ నిర్ణీత ఛార్జీలను అమలులోకి తెచ్చింది.
Read Also: Khammam Politics: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్..?