Paigah Lands: దశాబ్దాలుగా నలుగుతున్న ‘పైగా భూముల వివాదం’ (Paigah lands)లో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1958 నాటి సివిల్ సూట్ (CS)-14, CS-7 పరిధిలోని వివాదాస్పద భూముల్లో ఉన్న భవనాలు, ఇళ్లకు షరతులతో కూడిన రిజిస్ట్రేషన్లు కల్పించాలని భావిస్తోంది. అదే జరిగితే హైదరాబాద్ ఐటీ కారిడార్లోని హఫీజ్పేట్, కొండాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఆందోళన చెందుతున్న వేలాది మంది ఆస్తిదారులకు పెద్ద ఊరట లభించనుంది. అంతేకాకుండా దీనిద్వారా ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ల రూపంలో దాదాపు రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
నిజాం రాజులు తమ కుటుంబీకులకు జాగీర్లుగా ఇచ్చిన స్థలాలను ‘పైగా భూములు’గా పరిగణిస్తారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో దాదాపు 1,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పైగా భూములపై ఆరు దశాబ్దాలుగా న్యాయపోరాటం నడుస్తోంది. అయితే ఇందులో దాదాపు 600 ఎకరాల్లో ఇప్పటికే భారీ ఎత్తున భవనాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వెలిసాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి మండల పరిధిలోని హఫీజ్పేట్ సర్వే నంబర్ 80లోని 484 ఎకరాల్లో.. ఏకంగా 430 ఎకరాల్లో భవనాలు, అపార్ట్ మెంట్లు, గేటెట్ కమ్యూనిటీల నిర్మాణాలు జరిగి నివాస ప్రాంతంగా మారిపోయింది. ప్రస్తుతం 50 ఎకరాలు మాత్రమే ఖాళీగా ఉంది.
ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. రెవెన్యూ శాఖ చట్టంలోని 22 ఏ నిషేధిత భూముల జాబితా నుంచి పైగా భూములను తొలగించనున్నారు. అయితే తుది రిజిస్ట్రేషన్ పత్రాల్లో మాత్రం.. ఈ ఆస్తి హక్కులు సుప్రీంకోర్టు, హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల తుది తీర్పుకు లోబడి ఉంటాయి’ అనే షరతును మాత్రం స్పష్టంగా చేర్చనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు అనుమతులు ఉండి.. రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బంది పడుతున్న ఆస్తులను పరిశీలించి తుది ఉత్తర్వులు ఇస్తామని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ వెల్లడించారు. గురుకుల్ ట్రస్ట్, అయ్యప్ప సొసైటీ భూముల్లోనూ ఇదే తరహా సడలింపులపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: పరకాల కాక.. సీఎం రేవంత్ ‘ఇంట’ కొండా సురేఖ, రాఖీ సాకుతో రాజకీయ సంధి?
1958 నాటి నవాబ్ ఖుర్షీద్ జా పైగా (Nawab Khursheed Jah Paigah) ఆస్తుల పంపిణీకి సంబంధించిన CS-14 కేసుతో పాటు CS-7 పరిధిలోని భూములు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉన్నాయి. కూకట్పల్లి సమీపంలోని నవాబ్పేట్ / హైదర్నగర్ సర్వే నంబర్ 172లోని 192 ఎకరాల భూమిలో 54 ఎకరాలు (OSA 55/2004) మినహా మిగిలిన భూమిపై వివాదం ఉంది. మినహాయింపు పొందిన భూమి కాకుండా మిగిలిన ప్రభుత్వ స్థలంలో పేదల కోసం ‘2 BHK’ గృహనిర్మాణ పథకాన్ని చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే హస్మత్పేట్, శంషాబాద్ సమీపంలోని ఘన్సీమియాగూడ పరిధిలోని వివాదాస్పద భూములపై కూడా ప్రభుత్వం త్వరలోనే సమీక్ష నిర్వహించనుంది.
Also Read: తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ సేవలు.. ప్రయాణికులు ఫోన్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు, అదెలా సాధ్యం?