![Phone tapping case](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/03/PHONE-NEW-1280-x-720.jpg)
Telangana Phone tapping case Updates(Breaking news in telangana): తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, గట్టు మల్లు అరెస్ట్ అయ్యారు. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాధాకిషన్ రావు, గట్టు మల్లును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో గట్టు మల్లు ఎస్ఐబీ సీఐగా విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ప్రధాన సూత్రధారిగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేశారు. అలాగే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్పై బీజేపీ సంచలన ఆరోపణలు..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టారని తెలుస్తోంది. వారి ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను ధ్వంసం చేశారని ప్రణీత్ రావు ఆరోపణలు వచ్చాయి. కంప్యూటర్ హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో భుజంగరావు, తిరుపతన్న కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై బుధవారం వాదనలు ముగిశాయి. నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వు చేసింది.