DSP Promotions: స్వేచ్చ బ్యూరో: సుధీర్ఘకాలంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న 36మంది సీఐలకు సోమవారం తీపి కబురు అందింది. వారిని డీఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ డీజీపీ సీ.వీ.ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పదోన్నతులు పొందిన సీఐలు డీజీపీని కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ వారిని అభినందించారు. పదోన్నతి అన్నది కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని చెప్పారు. అంతకుమించిన బాధ్యత అని అన్నారు.
సమర్థంగా విధులు నిర్వర్తించి తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ప్రతి అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు.ప్రజల సమస్యలను సత్వరమే గుర్తించి, చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పారు. ప్రజలకు చేరువై అధికారులుగా మంచి పేరు తెచ్చుకోవాలని డీజీపీ సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజలతో సత్సంబంధాల పెంపు, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. డీఎస్పీ హోదాలో ప్రతి నిర్ణయం ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా ఉండాలన్నారు.
Also read: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో రూ.2 వేల కోట్లు రిలీజ్.. ఆర్థికశాఖ ఉత్తర్వులు
ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించాలని తెలిపారు. ప్రజల భద్రత, సంక్షేమమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా అంకితభావంతో పనిచేస్తేనే వృత్తిపరంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. పదోన్నతి పొందిన అధికారులు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ లో కాకుండా ఇతర విభాగాల్లో తమ సేవలను అందించనున్నారు. డీఎస్పీలకు పోస్టింగులు ఇదిలా ఉండగా చాలా రోజులుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న 36మంది డీఎస్పీలకు డీజీపీ ఆనంద్ పోస్టింగులు ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Also read: ‘హరీశ్ రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది’.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు!