Hyderabad: తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర ఓటర్ల జాబితా సవరణ-సర్ రాజకీయ పార్టీల్లో కొత్త టెన్షన్ మొదలైందా? ఏకంగా 70 లక్షల ఓట్లు తొలగిస్తారన్న వార్తల నేపథ్యంలో నేతలకు కంగారు మొదలైందా? తెలంగాణవ్యాప్తంగా కంటే.. గ్రేటర్ చుట్టూ ఉన్న నేతలకు ఈ టెన్షన్ మరింత ఎక్కువైందా? ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. గురువారం పార్టీ కీలక నేతలు జూమ్ మీటింగ్లో భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి.. నేతలకు కీలక సూచనలు చేశారు.
తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర ఓటర్ల జాబితా సవరణ నాలుగైదు రోజుల్లో విడుదల కానుంది. భారీ సంఖ్యలో ఓట్లు పోతాయన్న వార్తల నేపథ్యంలో గురువారం రాత్రి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ మీటింగ్ జరిగింది. అందులో సీఎం రేవంత్రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, పలువురు మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జ్లు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. SIR ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 శాతం ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇంచార్జ్ మంత్రుల నుంచి బూత్ లెవెల్ వరకు సరైన బాధ్యత తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే సంబంధిత ఇంచార్జ్ మంత్రులు.. జిల్లాల్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులతో సమీక్ష చేపట్టాలన్నారు.
రెండు రోజులు క్షేత్ర స్థాయికి వెళ్లి జిల్లాల్లో సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల నివేదిక జిల్లా ఇంచార్జ్ మంత్రులు తయారు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఇంఛార్జులు 4 రోజులు నియోజకవర్గంలో ఉండి సమస్యలు తెలుసుకుని పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్నారు. సరైన కార్యాచరణతో ముందుకు వెళ్లకుంటే పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని కుండబద్దలు కొట్టేశారు. ఈ విషయంలో AICC నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, పకడ్బందీ కార్యాచరణతో వెళ్లకపోతే భవిష్యత్లో రాజకీయంగా పెద్ద నష్టం జరిగే అవకాశముందన్నారు. SIR లో సమస్యలను పరిష్కరించడంతోపాటు.. బీజేపీ-బీఆర్ఎస్ కలిసి చేస్తున్న ఓట్ల తొలగింపు కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్లాలని చెప్పారు.
సర్ పేరిట తెలంగాణలో ఎన్నికల కమిషన్ 73 లక్షల ఓట్లు తొలగించడం, 64 లక్షల ఓట్లు అనమిలిస్గా పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుందన్నారు ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఈ స్థాయిలో ఓట్ల తొలగింపు ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. బీజేపీ-ఈసీ చేస్తున్న కుట్రలో భాగంగా పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాలలో జరిగిన అంశాలు, గత అనుభవాలు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఓట్ల తొలగింపు కుట్ర రాజకీయాలు అత్యంత ప్రమాదంగా చెప్పుకొచ్చారు. బీఎల్ఏలు చాలా అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ఓటర్లు తిరిగి ఓటు హక్కు పొందేలా చూడడం వారి పాత్ర కీలకమైందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ఇప్పుడు డిజిటల్ కానీ ఓట్లు- అనమిలిస్ ఓట్లు పరిశీలించాలన్నారు. భవిష్యత్లో జరగబోయే ఎన్నికలకు ఈ ఓట్లు కీలకమవుతాయన్నారు. ఈ స్థాయిలో ఓట్ల తొలగింపు చాలా ప్రమాదకరమన్నారు. తొలగించిన ఓట్లు, అనమిలిస్ ఓట్లు కలిపితే దాదాపు కోటి 30 లక్షలకు పైగా ఉన్నాయని, ఇది చాలా ప్రమాదకరమన్నారు. శుక్రవారం నుంచి నేతలంతా సర్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బీఎల్ఏలు వార్డుల్లో ప్రతి ఓటును పరిశీలించాలని, ఎక్కడ చిన్న నిర్లక్ష్యం జరిగినా సహించేది లేదన్నారు. పని చేయని కో-ఆర్డినేటర్లు-బీఎల్ఏలను వెంటనే తొలగించి కొత్తవారిని నియమించాలన్నారు. ఇంచార్జ్ మంత్రులు, నియోజకవర్గం ఇంచార్జ్లు ఈ పని మీద ఉండాలని, నిర్లక్ష్యం చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీస్తుందన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే ఎంత పెద్ద లీడరైనా చర్యలు తప్పవని తేల్చేశారు ఆమె.
ALSO READ: తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్కార్డులు.. ఎన్ని భద్రతలు తెలుసా? హోలోగ్రామ్ నుంచి మొదలు
దేశంలో ఎక్కడ లేనంతగా తెలంగాణలో భారీగా ఓట్ల తొలగింపు అత్యంత ప్రమాదకరమైన అంశంగా చెప్పారు పీసీసీ అధ్యక్షులు మహేష్కుమార్ గౌడ్. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. బీజేపీ-కేంద్ర ఎన్నికల కమిషన్ లోపాయకారి కుట్ర జరిగినట్టు ఉందని అభిప్రాయపడ్డారు. బెంగాల్లో జరిగిన దాని కంటే తెలంగాణలో ఎక్కువ ఓట్లు తొలగించారన్నారు. 3.3 కోట్ల ఓట్లలో కోటి 30 లక్షలు తొలగించే కుట్ర జరుగుతుందంటే.. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంచార్జ్ మంత్రులు చాలా సీరియస్గా వర్క్ చేయాలన్నారు. మీ పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి ఓటును పరిశీలించాలన్నారు. ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చేవరకు నియోజకవర్గాలలో ఈ పని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. చిన్న నిర్లక్ష్యం ఉండొద్దని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకులపై చర్యలు తప్పవని తేల్చేశారు.