Indiramma Towers: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ శంకుస్థాపన సందర్భంగా కూకట్పల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమం కేవలం శంకుస్థాపనకే పరిమితం కాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, ప్రతిపక్షాల విమర్శలపై నేరుగా సమాధానం ఇచ్చే వేదికగా మారింది.
కూకట్పల్లి ప్రజలతో పేగు బంధం.. అభివృద్ధి బాధ్యత
ఆనాడు నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు కూకట్పల్లి ప్రజలు నన్ను ఆశీర్వదించి గల్లీ నుంచి ఢిల్లీకి పంపారని సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిధుల కొరత వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానని, కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో కూకట్పల్లిని సమగ్రంగా అభివృద్ధి చేసే అధికారం, అవకాశం పూర్తిగా మన చేతుల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి శ్రీధర్ బాబును ఆదేశించారు.
సంక్షేమ పాలన.. రెండేళ్ల ప్రగతి
గత పదేళ్ల పరిపాలనను, తమ రెండేళ్ల పాలనతో బేరీజు వేసుకోవాలని సీఎం ప్రజలకు సూచించారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పథకాలను వివరిస్తూ.. ‘రాష్ట్రంలో 3 కోట్ల 28 లక్షల మందికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నాం. ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు, చీరలను సారెగా అందించాం. పొదుపు సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు ఇచ్చాం. వారిని బస్సులకు యజమానులుగా, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వాహకులుగా తీర్చిదిద్దుతున్నాం. శిల్పారామంలో స్టాళ్లు కేటాయించాం’ అంటూ సీఎం రేవంత్ తెలిపారు.
సొంతింటి కల నెరవేర్చే ‘ఇందిరమ్మ టవర్స్’
గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. పట్టణాల్లోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకే ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’కు శ్రీకారం చుట్టామన్నారు. మొదటి విడతలో లక్ష ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. సెక్షన్ 22A పరిధిలోని సొంత భూములు కోల్పోకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని, సోషల్ మీడియా అబద్ధాలను నమ్మవద్దని ధైర్యం చెప్పారు.
కుట్రలు పటాపంచలు.. అభివృద్ధి వైపు తెలంగాణ
గత ప్రభుత్వ అప్పులు తీరుస్తూనే సంక్షేమాన్ని పరుగెత్తిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరువు రావాలని కొంతమంది క్షుద్ర పూజలు చేసినా, దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురిశాయని చెప్పారు. మంచి మనసుతో చేసే పనికి దేవుడి ఆశీస్సులు ఉంటాయని, కుటిల బుద్ధి ఉన్నవారికి ఆ పూజలే తిరిగి చుట్టుకుంటాయని వ్యాఖ్యానించారు. నమ్మకంతో అండగా ఉంటే తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తానని హామీ ఇచ్చారు.
Also Read: వీడెక్కడి దొంగరా బాబు.. దొంగతనం చేసిన ఇంట్రోనే నిద్రపోయాడు!