Gram Panchayat Elections: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల వారీగా ఉన్న ఫోటో ఓటర్ల జాబితాలను (Photo Voter Lists) పునఃపరిశీలించి, తిరిగి ప్రచురించాలని అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో వార్డుల వారీగా జరిగిన ‘మిస్ మ్యాపింగ్’ దోషాలను సరిదిద్దాలని జిల్లా పంచాయతీ అధికారులకు (DPO) స్పష్టమైన సూచనలు చేసింది.
ఈ సవరణ ప్రక్రియకు సంబంధించి కమిషన్ ఒక అత్యవసర షెడ్యూల్ను విడుదల చేసింది. దీని ప్రకారం, నవంబర్ 20వ తేదీ నుంచి ఓటర్ల జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుంది. స్వీకరించిన అభ్యంతరాలను నవంబర్ 22వ తేదీ నాటికి అధికారులు పరిష్కరించాల్సి ఉంటుంది. సవరణల అనంతరం రూపొందించిన తుది ఫోటో ఓటర్ల జాబితాలను మరియు పోలింగ్ స్టేషన్ల వివరాలను నవంబర్ 23న తిరిగి ప్రచురించాలి.
అదే రోజు (నవంబర్ 23) తుది జాబితాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేందుకు ఎంపీడీవోలు (MPDOs), ఏడీఈఏలు (ADEAs) తక్షణ చర్యలు చేపట్టాలని ఈసీ సూచించింది. ఈ జాబితాల సమర్పణతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
Read Also: Bandi Sanjay: అలా జరిగితే నా శ్వాస ఆగిపోయినట్లే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు