MLAs Disqualification: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఏమోగానీ.. ఎమ్మెల్యేల అనర్హత అంశం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. స్పీకర్ నోటీసులకు స్పందించిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం
తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఓపెన్ కోర్టులో తీర్పు వెల్లడించనున్నారు. వాటికి సంబంధించిన వివరాలను శాసనసభ వెబ్సైట్లో ఉంచనున్నారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు విధించిన గడువు గురువారంతో ముగియనుంది. దీంతో స్పీకర్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వివిధ పార్టీల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ తన నిర్ణయాన్ని చెప్పనున్నట్లు తెలుస్తోంది.
స్పీకర్ తీర్పు ఎటువైపు? ఉప ఎన్నికల మాటేంటి?
తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలను ఇప్పటికే విచారించి వారి వాదనలను నమోదు చేశారు స్పీకర్. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అనర్హత పిటిషన్లపై వివరణ ఇవ్వాలని స్పీకర్ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు.
తమకు కొంత వ్యవధి కావాలని ఆయా సభ్యులు కోరారు. ఆ తర్వాత ఆయా నేతలు వివరణ ఇచ్చిన సందర్భాలు కనిపించలేదు. వారి పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం స్పీకర్ తీసుకుంటారా? గైర్హాజరుని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం ప్రకటిస్తారా? ఇవాళ స్పీకర్ తీర్పుతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయమని అంటున్నారు.
ALSO READ: గజ గజ వణుకుతున్న జనం.. మరో రెండురోజులు తప్పదా?
2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ని బీఆర్ఎస్ పార్టీ కోరింది. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరగడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించింది బీఆర్ఎస్. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కు గడువు విధించిన విషయం తెల్సిందే.