SSC Exams 2026: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు శనివారం మొదలయ్యాయి. కాగా తొలిరోజు అంతటా ప్రశాంతంగా జరిగినా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్ పల్లిలో విద్యార్థులకు సెల్ఫ్ సెంటర్ వేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ కన్ఫ్యూజన్ కు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖాధికారి క్లారిటీ ఇచ్చారు. జిల్లా పరిధిలో మొత్తం 237 సెంటర్లు ఉన్నాయని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో జోన్ల వారీగా విద్యార్థులకు సాఫ్ట్ వేర్ సహాయంతో జంబ్లింగ్ పద్ధతిలో స్కూళ్లు కేటాయించినట్లు తెలిపారు.
కూకట్ పల్లి జోన్ పరిధిలో 4 సెంటర్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మొత్తం 13 పాఠశాలలకు చెందిన 857 మందికి సాఫ్ట్ వేర్ సహాయంతో జంబ్లింగ్ పద్ధతిలో స్కూళ్లు కేటాయించినట్లు తెలిపారు. అందులోభాగంగా కూకట్ పల్లి న్యూ ఎరా స్కూల్ లో మొత్తం టెన్త్ విద్యార్థులు 337 మంది ఉండగా వారందరిలో 80 మందికి అదే స్కూల్ సెంటర్ కేటాయించినట్లు తెలిపారు. సాఫ్ట్ వేర్ జంబ్లింగ్ విధానం వల్ల ఈ ప్రక్రియ జరుగుతుందని స్పష్టంచేశారు. అంతేకాకుండా ఈ పరీక్ష కేంద్రానికి ఆ పాఠశాల సిబ్బంది కాకుండా పూర్తిగా ప్రభుత్వ ఉపాధ్యాయులను పరీక్షల నిర్వహనకు కేటాయించినట్లు స్పష్టంచేశారు. నలుగురు సిట్టింగ్ స్క్వాడ్లు, రెవెన్యూ శాఖ సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవకతవకవలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు స్పష్టంచేశారు. విద్యార్థులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 99.65 శాతం మంది హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు మొత్తం 786 మంది ఉండగా 160 మంది గైర్హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్(కాపీయింగ్) కేసులు నమోదు కాలేదు. ఇదిలా ఉండగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు సిబ్బందిని విధులకు దూరంగా ఉంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Also Read: KTR: మూసీ పునరుజ్జీవనం పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..!