Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడతను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఈ నెల 21వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఇన్ ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఉన్నాతాధికారులతో మంత్రి పొంగులేటి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం దూరదృష్టి లేకుండా హైదరాబాద్ నగరానికి దూరంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించిందని అన్నారు. అటువంటి తప్పు పునరావృత్తం కాకుండా పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిథిలోనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని స్థలాలను గుర్తించి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి 20-30 కి.మీ దూరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. నగరంలో జీవనోపాధి పొందుతున్న లబ్దిదారులు అక్కడ నివాసం ఉండేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదన్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలోనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్దిదారులను కేటాయించడానికి యుద్ద ప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఇప్పటికే పూర్తి అయిన వాటికి, వివిధ నిర్మాణ దశల్లో ఉన్న వాటికి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. అది కూడా ఆ కాలనీలకు 5-8 కి.మీ లోపు ఉన్న వారినే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణాలన్నీ పూర్తైన ఇండ్లలో లబ్ధిదారులు ఉండేలా చూసేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ కాలనీల్లో మంచినీరు, డ్రైనేజి, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కల్పనకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ పరిధిలో ఇండ్ల స్ధలాలు ఉండి అర్హులైన లబ్దిదారులకు ఈనెల చివరిలోగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు.
అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాశ్వత భవనాలు లేని ఆర్డీవో, తహశీల్దార్, సబ్ రిజస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. రెవెన్యూ, ఫారెస్టు సరిహద్దు వివాదాలకు ముగింపు పలికేలా రెండు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Share