Jupally Krishna Rao: స్వేచ్ఛ బ్యూరో: నిరర్ధకంగా ఉన్న పర్యాటక స్థలాలను వినియోగంలోకి తెచ్చి ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలను అన్వేషించాలని, దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆ స్థలాల్లో పర్యాటకులకు హోటల్స్ నిర్మాణం, ఆతిధ్యం, వెల్నెస్ సెంటర్, అమ్యూస్మెంట్ పార్క్స్ వంటి ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సాధ్యసాధ్యాలను పరిశీలించాలన్నారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని దేశంలోనే మేటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) కార్యాలయంలో సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎండీక్రాంతి వల్లూరి,ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పర్యాటక ఆస్తుల వినియోగం, ప్రాచూర్యం, ప్రచారం, ఆదాయ మార్గాలు, హరిత హోటళ్ల నిర్వహణ, పెండింగ్ పనులపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రధాన పర్యాటక ప్రాంతాలలో సూచిక బోర్డులు, ఫుడ్ కోర్టులు, టూరిజం సమాచార కేంద్రాలు వంటి ప్రాథమిక సౌకర్యాల స్థితిగతులపై మంత్రి సమీక్షించారు. బోటింగ్ సౌకర్యాలు, కాటేజీలు, వ్యూ పాయింట్లు, హరితహోటళ్ల నిర్వహణను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, పర్యాటకుల సంఖ్య పెరిగేలా, వారికి మరింత సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రపంచ పర్యాటక ముఖ చిత్రంలో తెలంగాణ కీలక స్థానంలో ఉండాలనే సీఎం రేవంత్ రెడ్డి అకాంక్షలకు అనుగుణంగా పర్యాటక రంగ అభివృద్ధి, బ్రాండింగ్, ప్రమోషన్, ప్రచారం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని చెప్పారు. పర్యాటక ప్రచారంపై ఆయా రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలను అధ్యయనం చేసి వాటికి ధీటుగా మన పర్యాటక ప్రాంతాలకు ప్రచారం కల్పించాలన్నారు.
ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు పర్యాటకులు సులభంగా చేరుకునేలా సూచిక బోర్డులను(డైరెక్షన్ సైనేజ్) ఏర్పాటు చేయాలని, సాధ్యమైనంత త్వరగా వీటిని పూర్తి చేయాలన్నారు. కేవలం దారి చూపడమే కాకుండా, ఆయా ప్రాంతాల చరిత్ర, ప్రాధాన్యతను బోర్డులపై క్లుప్తంగా వివరించాలని తెలిపారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంతో పాటు, కళాకారులను ప్రోత్సహించేందుకు పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మన కళలు, మన భాష, మన సంస్కృతి మన అస్తిత్వానికి ప్రతీకలు అని వాటిని పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించేందుకు కృషి చేయాలన్నారు. కళాకారులకు తగిన గుర్తింపు, ఆర్థిక చేయూత అందించే దిశగా చర్యలు ఉండాలన్నారు. ప్రసిద్ధ ప్రదేశాల్లో హంపి థియేటర్లు నిర్మించాలన్నారు.
Also read: Romantic Series OTT: ఓ వర్షం కురిసిన రాత్రి… ఫ్రెండ్ తమ్ముడితోనే యవ్వారం… ఐయండిబిలో టాప్ రేటింగ్
శాఖలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగకపోవడంపై శాఖ ఎండీపై ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. పర్యాటక శాఖ ఆద్వర్యంలో ఆయా రూట్లలో నడుస్తున్న బస్సుల వివరాలను, ఆదాయంపై మంత్రి ఆరా తీశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం పర్యాటక ప్యాకేజీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయడంతో గణనీయంగా ఆదాయం తగ్గిందని మంత్రికి సర్ధి చెప్పే ప్రయత్నం చెప్పగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బస్సులను కొనుగోలు చేశామని, వాటిని నిరుపయోగంగా ఉంచడం వల్ల ఆదాయం కొల్పోవాల్సి వస్తుందని, స్పెషల్ ప్యాకేజీలు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా చేపట్టిన సుమారు 84 పనుల పురోగతిపై ప్రాజెక్ట్ ల వారీగా సమీక్షించారు. పరిపాలనాపరమైన అనుమతులు మంజూరై… ఇంకా టెండర్ల దశలో ఉన్న, పనులు ప్రారంభం కాని వాటిపై ఆరా తీశారు. ప్రభుత్వ అనుమతుల వచ్చిన వెంటనే టెండర్లు పిలచి, త్వరితగతిన పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రధాన కార్యాలయం నుంచి రోజువారీ నివేదిక తెప్పించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనులను మరింత వేగవంతం చేయాలని అన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: Vijayawada News: పెళ్లై మూడు నెలలైనా భార్యకు దూరంగా భర్త.. నిలదీస్తే షాకింగ్ విషయాలు బయటకు