Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ ఆరంభంలోనే యూరియా.. కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. విత్తనాలు వేసే సమయానికి అవసరమైన ఎరువులు అందకపోవడంతో.. రైతులు ఉదయం నుంచే డీలర్ షాపుల ముందు క్యూలలో నిలబడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రైతులకు సాగుపై అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే.. పరిస్థితి ఇలానే ఉంటుందని హరీశ్ రావు విమర్శించారు. సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి సీఎంగా ఉంటే రైతుల బతుకులు క్యూ లైన్లలోనే తెల్లారాల్సి వస్తుంది అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో.. యూరియా కొరతే నిదర్శనమని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అందరినీ తొక్కుకుంటూ వచ్చాను అని గర్వంగా చెప్పుకునే సీఎం, ఇప్పుడు తన చెత్త పాలనతో రైతులనే తొక్కుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వపు చిల్లర రాజకీయాలు, విధ్వంసకర పాలనకు రైతులే బలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
యూరియా వంటి ప్రాథమిక ఎరువును కూడా సమయానికి అందించలేని వ్యక్తి.. ముఖ్యమంత్రి ఎలా అవుతారని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతులకు యూరియా కొరత కనిపించకుండా మసిపూసి మారేడుకాయ చేయడానికి తెచ్చిన యూరియా యాప్ ఏమైందని ఆయన నిలదీశారు. ఆ యాప్తో రైతులకు ఏమాత్రం ప్రయోజనం లేదని, కాగితాల మీద తప్ప వాస్తవంగా సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు.
యాసంగి సీజన్ మొదట్లోనే రైతులు ఇంత ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఒకవైపు మంత్రులు, అధికారులు విజయోత్సవాలు చేసుకుంటుంటే, మరోవైపు రైతులు మాత్రం చలి గాలిలో తెల్లవారుజాము నుంచే యూరియా కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి మాత్రం జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చుని.. రైతుల బాధలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మార్పు అని హరీశ్ రావు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన మాటలు ఎక్కడికి పోయాయని, గత సీజన్లో ఎదురైన యూరియా కొరత చేదు అనుభవాల నుంచి కూడా ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదా అని నిలదీశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాసంగి, వానాకాలం సీజన్లలో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత రాకుండా.. ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకున్నామని హరీశ్ రావు గుర్తుచేశారు. ఎరువుల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండేదని, డీలర్ల ద్వారా బ్లాక్ మార్కెట్ జరగకుండా కఠిన చర్యలు తీసుకునేవామని తెలిపారు.
Also Read: ఐఏఎస్లు వ్యవస్థకు పట్టిన దరిద్రం.. కూతురి పెళ్లికి రూ.1000 కోట్ల కట్నం! దీపక్రెడ్డి సంచలనం
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తెలంగాణలో యూరియా సమస్య తీరదా అని హరీశ్ రావు తీవ్రంగా ప్రశ్నించారు. వెంటనే యూరియా సరఫరా పెంచాలని, జిల్లాల వారీగా అవసరాలను అంచనా వేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల ఆగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.