
Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణకు వస్తున్నారు. ఈ నెల 30 వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. 5 రోజులపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి భారతీయ వాయుసేన విమానంలో రాష్ట్రపతి మధ్యాహ్నం 12.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
శంషాబాద్ నుంచి హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లి.. భ్రమరాంబామల్లికార్జునస్వామిని రాష్ట్రపతి దర్శించుకుంటారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ‘ప్రసాద్’ పథకం కింద ఆలయ అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి.. సాయంత్రం 4.15 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బొల్లారంలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద అమర జవాన్లకు నివాళులర్పిస్తారు. అనంతరం రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు.
సాయంత్రం 7.45 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై ఇచ్చే విందులో రాష్ట్రపతి పాల్గొంటారు. శీతాకాల విడిది కోసం వస్తున్న రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం హకీంపేటకు వెళ్లనున్నారు. రాత్రి రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చే విందు కార్యక్రమంలోనూ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
డిసెంబర్ 27న ఉదయం 10 గంటలకు నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలను ద్రౌపదీ ముర్ము సందర్శిస్తారు. అక్కడ అధ్యాపకులు, విద్యార్థులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 74వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ అధికారులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కంచన్బాగ్లోని మిధానికి వెళ్లి వైడ్ ప్లేట్ మిల్లును ప్రారంభిస్తారు.
డిసెంబర్ 28న ఉదయం రాష్ట్రపతి హకీంపేట నుంచి విమానంలో రాజమండ్రి వెళతారు. అక్కడి నుంచి హెలీకాప్టర్లో భద్రాచలానికి వెళ్లి.. సీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. ఈ క్షేత్రంలో ప్రసాద్ పథకం కింద చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. వనవాసీ కల్యాణ్ పరిషత్-తెలంగాణ ఏర్పాటు చేసే సమ్మక్క సారలమ్మ జనజాతి పూజారి సమ్మేళనాన్ని ప్రారంభిస్తారు. కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలను భద్రాచలం నుంచే ప్రారంభిస్తారు. అక్కడి నుంచి హెలీకాప్టర్లో వెళ్లి ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు, కామేశ్వరాలయ ఆలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
డిసెంబర్ 29న ఉదయం 11 గంటలకు జి.నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బీఎం మలానీ నర్సింగ్ కళాశాల, మహిళా దక్షత సమితి సుమన్ జూనియర్ కళాశాలల బోధకులు, విద్యార్థినులతో భేటీ అవుతారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్లో సమతామూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు.
డిసెంబర్ 30న ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి హెలీకాప్టర్లో యాదాద్రికి వెళ్లి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి నిలయానికి తిరిగి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విందు ఇస్తారు. అక్కడే వీరనారీలను సత్కరిస్తారు. ఇలా రాష్ట్రపతి శీతాకాల విడిది కొనసాగనుంది.