Water Rights: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ జల హక్కులపై మళ్లీ కత్తి వేలాడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికి తోడు, ఇప్పుడు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులు తెలంగాణ వ్యవసాయ, తాగునీటి రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసేలా పరిణమించాయి. ప్రధానంగా పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల డిజైన్లు, నీటి తరలింపు వ్యూహాలు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ, రాబోయే కాలంలో తీవ్ర నీటి ఎద్దడికి దారితీసేలా రూపుదిద్దుకున్నాయి.
శ్రీశైలం రిజర్వాయర్ వెనుక జలాల ఆధారంగా నిమిషానికి వేలాది క్యూసెక్కుల నీటిని తోడేసేలా వెలిగొండ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రూపుదిద్దింది. ఈ నెల 31న ప్రారంభానికి సిద్ధమైంది. వరద జలాల వినియోగం పేరిట ఏకంగా 43.50 టీఎంసీల కృష్ణా నీటిని కృష్ణా బేసిన్ బయటకు (బేసిన్ అవతలికి) తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల తెలంగాణకు చెందిన పాలమూరు-రంగారెడ్డి, దిగువన ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టు ఎండిపోయే ప్రమాదం ఉంది. శ్రీశైలంలో నీటిమట్టం త్వరగా పడిపోవడం వల్ల కల్పవకూర్తి ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రానికి తీవ్ర విఘాతం కలుగుతుంది.
గోదావరి నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్కు తరలించేలా పోలవరం డిజైన్ చేశారు. అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాల ప్రకారం గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు మళ్లించినప్పుడు, ఎగువన ఉన్న తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనపు వాటా (కనీసం 45 టీఎంసీలు) దక్కాలి. కానీ, ఈ హక్కును పక్కనబెట్టి, తెలంగాణను ఎండబెట్టే కుట్రలు సాగుతున్నాయి.
Also read: ఇంటర్నెట్ లేకుండా 4G ఫోన్.. పిల్లల కోసం HMD తీసుకొచ్చిన స్కూల్ ఎడిషన్ ఇదే!
ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, తెలంగాణలోని కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలోని ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల సాగునీటి ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం ఉంది. వరద సమయంలో కూడా నీరు తెలంగాణ ప్రాజెక్టులకు దక్కకుండా దిగువకు తరలిపోతుంది.
తెలంగాణ ప్రభుత్వం తక్షణమే కృష్ణా జలాల యాజమాన్య బోర్డు, గోదావరి బోర్డు వేదికలుగా ఈ ప్రాజెక్టుల అక్రమ నీటి తరలింపుపై చట్టపరమైన, సాంకేతికపరమైన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర జలకరువును ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also read: సాధారణ ప్రయాణికురాలిగా ఆదా శర్మ ట్రైన్ జర్నీ.. జనాలు షాక్!