IMD Telangana weather alert: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారబోతుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఆదివారం (ఏప్రిల్ 26) రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఉరుములతో కూడిన వర్ష సూచనను జారీ చేసింది. ఐఎండి తాజా బులెటిన్ ప్రకారం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు గణనీయమైన వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాలలో వాతావరణం రాబోయే 24 గంటల పాటు పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా మార్నింగ్ టైంలో నగరంలో పొగమంచు లేదా మసకబారిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎండ తీవ్రత విషయానికి వస్తే, నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ వరకు, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
ఈ అకస్మాత్తుగా మారే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ సహా ఏడు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని హెచ్చరించారు. గాలి వేగం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, తగు జాగ్రత్త వహించాలని సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు ఉండటం వల్ల వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: డిజిట్ జనగణన షురూ.. ఆన్ లైన్లో తమ వివరాలను నమోదు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి