NEET Leak: స్వేచ్ఛ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షా పేపర్ లీకేజీని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ సమర శంఖం పూరించింది. బుధవారం హిమాయత్నగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టిన యూత్ కాంగ్రెస్ శ్రేణులు, ప్రధాని నరేంద్ర మోడీ మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.పేపర్ లీకుల రాజ్యంగా కేంద్రం వ్యవహరిస్తుందని చెప్పారు. ప్రధాని మోడీ పదేళ్ల పాలనలో దేశం ప్రతి రంగంలోనూ విఫలమైందని మండిపడ్డారు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే జాతీయ స్థాయి పరీక్షలు నిరంతరం లీకవుతుండటం సిగ్గుచేటని విమర్శించారు.”గత పదేళ్లలో మోడీ హయాంలో దాదాపు 89 సార్లు పేపర్ లీకులు జరిగాయి, 48 సార్లు రీ-ఎగ్జామ్స్ నిర్వహించాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా కేంద్రం గుణపాఠం నేర్చుకోకపోవడం దారుణం,” అని ఆయన ధ్వజమెత్తారు.
Also Read: హుజూరాబాద్లో అట్టర్ ప్లాఫ్ షో.. నీరు గారిన ప్రభుత్వ కార్యక్రమం!
నీట్ పరీక్ష రద్దు కావడం వల్ల దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలో పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల పాటు కష్టపడి చదివిన విద్యార్థులు, లీకేజీల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాలకు ఉన్న స్వయం ప్రతిపత్తిని కాదని, జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష పెట్టి.. దాన్ని సక్రమంగా నిర్వహించలేకపోవడం ఎన్టిఎ వైఫల్యమేనని దుయ్యబట్టారు.
పరీక్ష నిర్వహణలో విఫలమైనందుకు ప్రధాని మోడీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి.లీకేజీకి కారణమైన ‘లీకేజీ వీరులపై’ విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.” అంటూ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హరిధర్, గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి, బొమ్మక్ అజయ్, సంతోష్ గౌడ్, కీజర్, శివాంత్ రెడ్డి, పీర్ మునీర్ తదితర ముఖ్య నేతలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Also read: బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయనిది.. మేము చేసి చూపించాం! పొంగులేటి సంచలన వ్యాఖ్యలు