Ponguleti Srinivas: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రభుత్వం చేస్తున్న పనులు, భవిష్యత్ ప్రణాళికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకొచ్చామని ఆయన వివరించారు. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో ఈ ప్రజాదర్భార్ను 14 క్లస్టర్లుగా విభజించి, ప్రజల నుంచి వస్తున్న ప్రతి విన్నపాన్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనే లేదని విమర్శించారు. దానికి భిన్నంగా తమ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, జూన్ 2వ తేదీన రెండో విడత ఇళ్లను ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. లబ్ధిదారులకు ఎక్కడా ఒక్క రూపాయ లంచం లేకుండా, నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నామని చెప్పారు. అలాగే రైతు రుణమాపీ కోసం 21 వేల కోట్లు ఖర్చు చేశామని, పెన్షన్ల విషయంలో కూడా త్వరలోనే ప్రజలకు ఒక తీసి కబురు అందిస్తామని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకే ‘ భూ భారతి’ ని ప్రవేశపెట్టామన్నారు.
ఇక జాతీయ రాజకీయాలు, నీట్ (NEET) పేపర్ లీకేజీ అంశంపై కూడా మంత్రి తీవ్రంగా స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మహారాష్ట్రల్లోనే పేపర్ లీక్ జరిగిందని, దీనివల్ల దేశవ్యాప్తంగా 23 లక్షల మంది, తెలంగాణలో 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని నాటకం ఆడుతోందని మండిపడుతూ.. ఈ లీకేజీకి కారకులైన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో గ్రూప్-1 అభ్యర్థులు , ఇంటర్ విద్యార్థులు పడ్డ కష్టాలను గుర్తు చేస్తూ.. ఇప్పుడు తమ ప్రభుత్వం ఏ విధమైన అవినీతి లేకుండా 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని ఆయన గుర్తుచేశారు.
Also Read: ప్రపంచానికే తెలియని వింత లోకం.. గాలిలో తేలియాడే ఈ గ్రామం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!