Tenth Results 2023(Telangana Latest News): ఒకప్పుడు పదో తరగతి ఫలితాలంటే తెగ ఆసక్తి ఉండేది. ఎవరు పాస్ అవుతారా, ఎవరు ఫెయిల్ అవుతారా అనే టెన్షన్ కనిపించేందు. ఇటీవల ఆ టెన్షన్ కొద్దిగా తగ్గింది. మాగ్జిమమ్ స్టూడెంట్స్ పాస్ అయిపోతున్నారు. ఇప్పుడు కేవలం ఎంత పర్సంటేజ్, ఏ గ్రేడ్ అనేదానిపైనే ఆసక్తి. ఈసారి కూడా పది పరీక్ష ఫలితాలు దుమ్మురేపాయి. 86.60 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.
ఎప్పటిలానే ఈసారి కూడా బాలికలదే పైచేయి. 88.53 శాతం బాలికలు పాస్ అయితే.. బాలురు 84.68 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. 2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. 25 స్కూల్స్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడం దారుణం.
ఇక ఒకప్పుడు ఫలితాల్లో ఎప్పుడూ చివరాఖరిలో ఉండే ఉమ్మడి ఆదిలాబాద్.. ఈసారి రిజల్ట్స్లో ముందుకు దూసుకొచ్చింది. 99 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోకే నిర్మల్ జిల్లా టాప్లో నిలిచింది. 59.46 శాతంతో వికారాబాద్ది లాస్ట్ ప్లేస్.
ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 14 నుంచి 22 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అందుకోసం ఈనెల 26లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఫలితాలు ఎలా ఉన్నా.. ఈసారి టెన్త్ ఎగ్జామ్స్ మాత్రం రసాభాసగా నడిచాయి. మొదటిరోజే పరీక్ష పేపర్ లీక్. లీక్ చేసింది కూడా ఓ ప్రభుత్వ టీచర్. ఆ ఘటనలో ముగ్గురిపై వేటు పడింది. ఇక ఆ మర్నాడే హిందీ పేపర్ బయటకువచ్చింది. అది మరింత సంచలనంగా నిలిచింది. హిందీ పేపర్ లీకేజీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయే కారణమంటూ ఆయనపై కేసు పెట్టి.. ఏ1 నిందితుడిగా చేర్చి.. అరెస్ట్ చేసి.. జైలుకు కూడా తరలించారు. ప్రస్తుతం బండి.. బెయిల్పై బయట ఉన్నారు. పది ఫలితాల కంటే.. పది పరీక్షల నిర్వహణే ఉత్కంట రేపటం బహుషా ఇదే మొదటిసారి కాబోలు.