TG Farmers: రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 10 వేల ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని ఆదేశించింది. కూరగాయల రైతులపై భారం తగ్గించేందుకు ఎకరాకు రూ.9,600 సబ్సిడీ చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
రాష్ట్రంలో సుమారు 1.35 లక్షల ఎకరాల్లో 14.64 లక్షల టన్నుల కూరగాయల ఉత్పత్తి చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో దాదాపు 26 లక్షల టన్నులు కూరగాయలు అవసరం ఉంది. దీంతో పాటు అదనంగా 12.68 లక్షల టన్నుల ఉత్పత్తి అవసరం ఉన్నట్టు వ్యవసాయ విశ్వవిద్యాలయ పేర్కొంది. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రతి ఏటా 10 వేల ఎకరాల్లో అదనంగా కూరగాయల సాగు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సమీకృత ఉద్యాన మిషన్ పథకం కింద ఎకరాకు రూ.9,600 సబ్సిడీ నేరుగా రైతు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక ఎకరా భూమిలో కూరగాయలు సాగు చేస్తే 6 టన్నుల ఉత్పత్తి వస్తుందని ఉద్యాన శాఖ అంచనా వేసింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇలా పంటసాగుకు ఎకరాకు రూ.24 వేలు ఖర్చు అవుతుంది. ఈ క్రమంలో 40 శాతం రాయితీని రైతుల ఖాతాలో నేరుగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
బెండ, టమాట, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్వాలీఫ్లవర్, బీర, దొండ, క్యాప్సికం, కాకర, చిక్కుడు, సోరకాయ ఇతర తోటల సాగుకు ముందుకొచ్చే రైతులు ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే సబ్సిడీ అందించేలా చర్యలు తీసుకుంటారు. ప్రతి రైతుకు రెండున్నర ఎకరాల వరకు రాయితీ అందించనున్నారు. ప్రారంభించి గుర్తింపు పొందిన నర్సరీలు లేదా ఉద్యానవన శాఖ నుంచి విత్తనాలు, నారు కొనుగోలు చేస్తే వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. రాయితీ మూలంగా రానున్న రోజుల్లో కూరగాయల సాగు పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Solar Plants: మహిళలకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.20 లక్షలు సంపాదించే ఛాన్స్, ఏం చేయాలంటే?
హైదరాబాద్ జీడిమెట్ల, సిద్దిపేట ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నర్సరీలు ఈ ప్రాజెక్ట్ కోసం నారులు సిద్ధం చేస్తున్నాయి. అలాగే ప్రభుత్వం రైతులకు అవసరమైన విత్తనాలను తక్కువ ధరకు అందజేయనుంది. సమీకృత ఉద్యాన మిషన్ పథకం ద్వారా కూరగాయల ఉత్పత్తిని పెంచి ధరల స్థిరీకరించాలని ప్రభుత్వం యోచిస్తుంది.