TGSRTC New Bus Stations : తెలంగాణలో ఆర్టీసీకి మరిన్ని సదుపాయాలు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రజలకు మెరుగైన ప్రయాణ సదుపాయాల్ని కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్న రేవంత్ సర్కార్.. తాజాగా రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో కొత్త బస్టేషన్లు నిర్మించాలని భావిస్తోంది. ఇందుకోసం నిధుల్ని సైతం కేటాయించింది. శనివారం నాడు హైదరాబాద్ లోని బస్ భవన్ లో సమావేశమైన ఆర్టీసీ బోర్డు ఈ మేరకు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. దీంతో.. కొన్ని రోజుల్లోనే నూతన బస్ స్టేషన్లు, బస్ డిపోలు సహా అవసరమైన చోట్ల విస్తరణ పనులు జరగనున్నాయి.
ఆర్టీసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఏఏ జిలాలకు నూతన బస్ స్టేషన్లు రానున్నాయి అంటే..
పెద్దపల్లిలో కొత్త బస్ డిపో నిర్మించేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఆర్టీసీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. రూ.11.70 కోట్లు కేటాయిస్తూ అనుమతులు సైతం మంజూరు చేసింది. అలాగే.. మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లా ఏటూరు నాగారంలోనూ కొత్త బస్ డిపో నిర్మాణం చేపట్టాలని భావించిన ఆర్టీసీ.. ఇందు కోసం రూ.6.28 కోట్లు కేటాయిస్తూ అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాంతంలో డిపో వస్తే.. ఆ చుట్టు పక్కల అనేక ప్రాంతాలకు బస్ కనెక్టివిటీ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. చాన్నాళ్లుగా.. బస్ సౌకర్యానికి దూరంగా ఉన్న అనేక గ్రామాలు, ప్రాంతాలు.. తాజా నిర్ణయంతో బస్ సౌకర్యం అందుకోనున్నారు. మిగతా ప్రాంతాలకు బస్ రాకపోకలు అధికం కానున్నాయి.
ములుగు జిల్లాలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన ఆర్టీసీ బోర్డు.. ఇందుకోసం రు. 5.11 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో కొత్త బస్ స్టేషన్ రానుంది. ఇక్కడి నుంచి దక్షిణ తెలంగాణా ప్రాంతాలైన ఖమ్మం, నల్గొండ, వరంగల్ ప్రాంతాలకు కనెక్టివిటీ ఉన్న నేపథ్యంలో.. కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి ఆర్టీసీ అధికారులు మొగ్గు చూపారు. కాగా..హుజుర్ నగర్ లో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి రూ. 3.75 కోట్లు కేటాయించారు.
ఇక.. డిప్యూటీ సీఎం భట్టీిి విక్రమార్క సొంత నియోజకవర్గం అయిన మధిరలోనూ నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి ఆర్టీసీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం.. రూ..10.00 కోట్లు కేటాయిస్తూ ఆర్టీసీ బోర్టు అనుమతులు మంజూరు చేసింది. ములుగు జిల్లా మంగపేటలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి రూ. 51 లక్షలు కేటాయింపు. పెద్దపల్లి జిల్లా మంథని బస్ స్టేషన్ ను విస్తరించాలని నిర్ణయించిన అధికారులు.. వివిధ పనుల నిమిత్తం రూ.95.00 లక్షలకు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన ఆర్టీసీ బోర్టు.. రూ.95 లక్షలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
సూర్యాపేట జిల్లా కోదాడలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం.. విజయవాడ నుంచి వచ్చే వారితో పాటు ఖమ్మం, నల్లొండ, మిరియాలగూడ వంటి సమీప ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక బస్ స్టేషన్ ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం.. ఏకంగా రూ. 17.95 కోట్లు కేటాయిస్తూ ఆర్టీసీ బోర్టు నిర్ణయించింది. అలాగే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే “సరస్వతి పుష్కరాల” దృష్ట్యా ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి రూ. 3.95 కోట్లు కేటాయిస్తూ ఆర్టీసీ బోర్డు అనుమతులు ఇచ్చింది.
ఆర్టీసీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. రాష్ట్రంలో కొత్త డిపోల ఏర్పాటుతో పాటు ప్రస్తుతమున్న 97 డిపోలు & బస్ స్టేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిందని.. అందుకు అనుగుణంగా కొత్త బస్ స్టేషన్ల నిర్మాణంతో పాటు ఉన్నవాటిని విస్తరిస్తున్నామని తెలిపారు.
Also Read : కన్నీరు పెట్టుకున్న పూజారి.. కదిలి వచ్చిన అధికార యంత్రాంగం.. ఏమైందంటే..
రాష్ట్ర ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు కొత్త బస్సులను కొనుగోలు చేస్తూనే.. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఆర్టీసీ బోర్డు అనుమతి లభించిన నూతన డిపోలు, బస్ స్టేషన్లను త్వరతిగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.